శివారు కాలనీలే టార్గెట్‌

Robbery Gang Arrest in Hyderabad - Sakshi

దోపిడీ దొంగల ముఠా ఆటకట్టు నలుగురి అరెస్టు

ప్రధాన నిందితుడిది తమిళనాడు

27 ప్రాంతాల్లో చోరీలు రూ.22 లక్షల సొత్తు స్వాధీనం

నేరేడ్‌మెట్‌: శివారు కాలనీలనే లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను ఎల్‌బీనగర్‌ సీసీఎస్, మీర్‌పేట్‌ పోలీసులు అరెస్టు చేశారు.  నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 47.5తులాల బంగారు, రెండు కిలోల వెండి ఆభరణాలు, ఒక ఎయిర్‌ పిస్టల్, గుళికలు, పెప్పర్‌స్ప్రే, మూడు బైక్‌లు, ఒక టీవీ , పియానో, రెండు కత్తులు సహా రూ.22లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీలు సన్‌ప్రీత్‌సింగ్, రక్షితమూర్తిలతో కలిసి సీపీ మహేష్‌భగవత్‌ వివరాలు వెల్లడించారు. 

బతుకుదెరువు కోసం వచ్చి..
తమిళనాడు రాష్ట్రం, దుండిగల్‌ జిల్లా, బట్లగుండుకు చెందిన వర్దన్‌ మణికందన్‌ అలియాస్‌ గణేష్‌ బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి కుర్మగూడలో ఉంటున్నాడు.  కొంత కాలం పాటు కూలీగా, క్యాటరింగ్‌ తదితర పనులు చేశాడు. జల్సాలకు అలవాటు పడిన అతను 2015లో యాదాద్రి జిల్లా, చౌటుప్పల్‌కు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి పిల్ల యాదయ్య అలియాస్‌ యాది, నల్గొండ జిల్లా, మునుగోడు మండలం కొంపల్లి గ్రామానికి చెందిన సయ్యద్‌ అలియాస్‌ సలీం,  ఎదులాబాద్‌కు చెందిన ములుపోజు ఉపేంద్రచారి అలియాస్‌ చారి, దూల్‌పేట్‌కు చెందిన అరకాల లక్ష్మినారాయణతో కలిసి ముఠా ఏర్పాటు చేశారు.  అందరూ కలిసి శివారు కాలనీల్లో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేసేందుకు పథకం పన్నారు.

రెండేళ్లుగా 27 చోరీలు...
రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఉప్పల్, తుర్కపల్లి, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, మీర్‌పేట్, వలిగొండ, వనస్థలిపురం, సరూర్‌నగర్, ఎల్‌బీ.నగర్, బాలాపూర్‌ ఠాణాల పరిధిలోని కాలనీల్లో ఈ ముఠా 27 ఇళ్లలో చోరీలకు పాల్పడింది. మీర్‌పేట్‌ పరిధిలో 10, హయత్‌నగర్‌లో 7 సార్లు పంజా విసిరారు. నిందితుడు షేక్‌ సయ్యద్‌ కొంత చోరీ సొత్తును చౌటుప్పలో ఐఎఫ్‌ఎల్‌ తనఖా పెట్టాడు. ప్రధాన నిందితుడి ఇంట్లో దాచిన మిగతా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంత సొత్తును వివిధ ప్రాంతాల్లో విక్రయించి జల్సా చేసినట్లు సీపీ తెలిపారు.

దొరికింది ఇలా...
గత నెల 12న రాత్రి  మీర్‌పేట్‌  క్రైం, పెట్రోలింగ్‌ పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులను అనుమానంతో ఆపారు. మణికందన్‌ తన పేరు గణేష్‌ అని టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌గా చెప్పుకున్నాడు. గుర్తింపు కార్డు చూపెట్టాలని కోరగా బైక్‌లో నుంచి ఐడీ కార్డు తీస్తున్నట్లు నటించి పోలీసులపై పెప్పర్‌స్ప్రే కొట్టి,  దాడికి యత్నించాడు.దీంతో పోలీసులు చాకచక్యంగా బైక్‌ వెనుక కూర్చున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు,  బైక్‌ డ్రైవ్‌ చేసిన వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిని వ్యక్తిని దూల్‌పేటకు చెందిన లక్ష్మీనారాయణగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా వర్ధన్‌ మణికందన్‌తోపాటు ఇతర ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.  సోమవారం మీర్‌పేట్‌ పోలీసులు నలుగురు ముఠా నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వర్ధన్‌ మణికందన్‌ అరెస్టులో తమిళనాడు పోలీసులు సైతం సహకరించినట్లు సీపీ తెలిపారు.

గుప్త నిధుల తవ్వకాలపై ఆరా..
గుప్తనిధుల తవ్వకాల కేసులో గత నెల 24న దేవరకొండ పోలీసులు వెస్ట్‌మారేడుపల్లికి చెందిన మల్లేష్‌ను అరెస్టు చేశారు. మల్లేష్‌తోనూ  ఈ ముఠాకు పరిచయం ఉందని, గుప్తనిధుల తవ్వకాల కోసం మల్లేష్‌కు సహాయంగా ఈ ముఠా సభ్యులు వెళ్లినట్టు విచారణలో వెల్లడైందని సీపీ తెలిపారు.ఈ ముఠా సభ్యులకు గుప్తనిధుల తవ్వకాలతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. సమావేశంలో సీఐలు ప్రవీణ్‌బాబు, అశోక్‌కుమార్, ఎస్‌ఐ ముదసర్‌ఆలీ, డీఐ సత్యనారాయణ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top