ప్రయాణికుల ముసుగులో.. దారిదోపిడీలు
ప్రయాణికులను ఏమారుస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ఆటో డ్రైవర్లు
ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్
మై ఆటో ఈజ్ సేఫ్ యాప్ను వినియోగించుకోవాలని సూచన
కంటోన్మెంట్: ప్రజల భద్రత కోసం పోలీసులు అధునాతన టెక్నాలజీతో కూడిన పలు వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నా... వాటిపై సరైన అవగాహన లేకపోవడంతో అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రజల భద్రత కోసం ప్రవేశపెట్టిన మొబైల్ యాప్లు సహా ఇతర సలహాలు, సూచనలు పాటించడంలో ప్రజల నిర్లక్ష్యాన్ని నేరగాళ్లు ఎంచక్కా క్యాష్ చేసుకుంటున్నారు. నగరం నడిబొడ్డునే సంచరిస్తూ అమాయక ప్రజలను దోచుకుంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇలాంటి దోపిడీ ముఠాకు చెందిన సభ్యులను కార్ఖానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. వివరాల్లోకి వెళితే జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేంద్రంగా రాత్రివేళల్లో ప్రయాణించే అమాయకులను టార్గెట్ చేసుకుని దోపిడీకి పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను కార్ఖానా పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు. శుక్రవారం కార్ఖానా సీఐ మధుకర్ స్వామి వివరాలు వెల్లడించారు.
బాధితుడి ఫిర్యాదుతో..
కార్ఖానాకు చెందిన రామచందర్ అనే వ్యక్తి ఈ నెల 6న పటాన్ చెరువు వెళ్లి, రాత్రి 11.00 గంటలకు సికింద్రాబాద్ 31 బస్టాప్ వద్దకు వచ్చాడు. అక్కడినుంచి కార్ఖానా వెళ్లేందుకు అతను బస్సు కోసం ఎదురు చూస్తుండగా ఓ ఆటోడ్రైవర్ వచ్చి తాను అటే వెళ్తున్నానని చెప్పి ఆటోలో ఎక్కించుకున్నాడు. అప్పటికే ఆ ఆటో మరో వ్యక్తి ఉన్నాడు. మార్గంలో మరో ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకుని, రామచందర్ను దారి మళ్లించి బాంటియా గార్డెన్ ఎదురుగా ఉన్న ఓంబిర్ కాలనీలోకి తీసుకెళ్లారు. అక్కడ నిర్మానుష్య ప్రదేశంలో ఆటో డ్రైవర్తో సహా ప్రయాణికుల మాదిరిగా ఆటోలో ఉన్న అతని అనుచరులు దాడి చేసి రామచందర్ వద్ద ఉన్న నగదు, సెల్ఫోన్ సహా ఇతర పత్రాలను సైతం లాక్కున్నారు. అదే రోజు అర్ధరాత్రి బాధితుడు కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితులు అర్మన్ ఆలమ్, అక్షయ్ చంద్రశేఖర్ సూర్య వంశి, దీపక్ యాదవ్, హారీ రాజు ఫ్రాన్సిస్, బొమ్మకంటి ప్రదీప్ గౌడ్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఓ కచ్చితమైన చిరునామా అంటూ లేని జులాయి వ్యక్తులు ముఠాగా ఏర్పడి నగరంతో పాటు, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో పలు దారిదోపిడీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని సీఐ తెలిపారు. తాజా కేసులో నిందితులు గతంలోనూ పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని, కొన్ని కేసుల్లో శిక్ష కూడా అనుభవించారన్నారు. సమావేశంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నేతాజీ, ఎస్ఐలు రవిపాల్, సందీప్రెడ్డి పాల్గొన్నారు.
100 కెమెరాలూ కనిపెట్టలేక పోయాయ్!
ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానం అంటూ ప్రచారం చేసిన పోలీసులకు, దారి దోపిడీ దొంగలను పట్టుకోవడంలో 100 కెమెరాలు సైతం ఉపయోగపడకపోవడం గమనార్హం. దారి దోపిడీ కేసును చేధించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పా టు చేసిన పోలీసులు బాధితుడు వెల్లడించిన ఆధారాల మేరకు బస్స్టేషన్ సమీపంలోని ఆటోలపై నిఘా పెట్టారు. ఆటో వెనుక భాగంలో ‘మై ఆటో ఈజ్ సేఫ్’ అన్న స్టిక్కర్, అపాచీ టూ వీలర్ యాడ్, హెడ్లైట్ పనిచేయక పోవడం వంటి ఆధారాలతో సీసీ కెమెరాల ద్వారా ఓ ఆటోను గుర్తించారు. అయితే సంఘటన జరిగిన సమీపంలోని 100 కెమెరాల్లోనూ సంబంధిత ఆటో నెంబర్ను గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు పాత పద్ధతిలోనే తాము గుర్తించిన ఆటోను వెంబడించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుల భద్రత కోసం పోలీసులు ప్రవేశపెట్టిన మై ఆటో ఈజ్ సేఫ్, హాక్ ఐ వంటి మొబైల్ యాప్లను సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.