జల్సాలకు అలవాటుపడి చోరీల బాట
ముగ్గురి అరెస్టు... రూ 3.50 లక్షల
విలువైన సొత్తు స్వాధీనం
నిందితుల్లో ఓ యువతి
మల్లాపూర్: జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు యువకులు, మరో యువతిని గురువారం మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నాచారం సీసీఎస్లో గురువారం రాచకొండ క్రైం అడిషినల్ డీసీపీ ఎస్కే సలీమా వివరాలు వెల్లడించారు. మల్కాజిగిరి వసంతపురి నగర్కు చెందిన వేముల నవీన్ అలియాస్ బాబి, మల్కాజిగిరి రాఘవేంద్ర కాలనీకి చెందిన సింగిరెడ్డి జ్యోతి అలియాస్ నాగజ్యోతి, వెంకటేశ్వర కాలనీకి చెందిన గోర్నకొండ నిఖిల్ అలియాస్ చిన్న స్నేహితులు. జల్సాలకు అలవాటు పడిన వీరు ముగ్గురు గత కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నారు.
గురువారం బోడుప్పల్ చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సీసీఎస్ పోలీసులు అటువైపు వెళుతున్న వీరిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా ఉప్పల్ పీఎస్ పరిధిలో ఓ ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో రెండు చోట్ల సెల్ఫోన్ల చోరీకి పాల్పడినట్లు తెలిపారు. గతంలో ఓయూ పోలీస్స్టేషన్ పరిధిలో బైక్, నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో సెల్ఫోన్, చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు వెల్లడైంది. వారి నుంచి రూ 3.50 లక్షల విలువైన 9 తులాల బంగారు నగలు, ఎల్ఈడీ టీవీ, రెండు ఫాస్ట్ట్రాక్ వాచీలు, రెండు ఐఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సమావేశంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్లు ఎస్.లింగయ్య, జగన్నాథరెడ్డి, శివశంకర్రావు, రుద్ర భాస్కర్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.