ప్రాణం తీసిన అతివేగం
చివ్వెంల(సూర్యాపేట): మితిమీరిన వేగం.. ఆపై రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు ఇద్దరి ప్రాణాలను బలిగొనగా మరొకరిని అంపశయ్యపై ఊగిసలాడేలా చేసేశాయి. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ జిల్లా వైద్యాధికారి నిమిషకవి భిక్షపతి(59) పని నిమిత్తం ఇటీవల విజయవాడకు వెళ్లాడు. అక్కడ పని ముగిసిన అనంతరం విజయవాడకు చెందిన తిరువీధుల వాసు(45)తో కలిసి శనివారం కారులో కరీంనగర్కు బయల్దేరాడు. అయితే మార్గమధ్యలో సూర్యపేట జిల్లా చివ్వెంల మండల పరిధిలోని గుంజలూరు గ్రామస్టేజీ వద్ద జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వర్షపు నీరు కారు ముందు భాగంలోని అద్దంపై పడింది.
దీంతో ఎదురుగా ఏమి కనపడక పోవడం, అతివేగంతో ఉన్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టు, డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక భాగంలో కూర్చున్న రిటైర్డ్ డీఎంహెచ్ఓ, ముందుభాగంలో కూర్చున్న వాసు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వరంగల్కు చెందిన కారు డ్రైవర్ రెడ్డిమళ్ల రామ్మూర్తి తీవ్రంగా గాయపడ్డా డు. పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు అతడిని 108 వాహనంలో హైదరాబాద్కు తరలించారు. అయితే వాసు జేబులో కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన ఎస్సై బి. శ్రీరాములుకు చెందిన గుర్తింపు కార్డు ఉండడంతో పోలీసులు ఆరా తీశారు. అయితే శ్రీరాములు క్షేమంగా ఉన్నాడని, టోల్గేట్ల వద్ద టోల్రుసుం నుంచి తప్పించుకునేందుకు అతడి గుర్తింపు కార్డు తీసుకువచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
ఘటన స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ ప్రకాశ్ జాదవ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. రిటైర్డ్ డీఎంహెచ్ఓ బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్పీ ఆధ్వర్యంలో ఎస్సై బి.ప్రవీణ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.