ఇన్స్పెక్టర్ హత్య కేసులో కొత్త కోణం
జైపూర్ : రాజస్థాన్లో విషాదరకరమైన రీతిలో హత్యకు గురైన తమిళనాడు ఎస్సై పెరియార్ పాండియన్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పెరియార్ను తాకిన బుల్లెట్ సహచర పోలీసు రివాల్వర్ నుంచి వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి. నాలుగు కేజీల బంగారం దోచుకెళ్లిన దుండగులు నాధూరాం, దినేష్ చౌదరిలను పట్టుకునేందుకు తమిళనాడు పోలీసు శాఖకు చెందిన ఎస్సై పెరియార్ పాండియన్, మరో ఇన్స్పెక్టర్ టీఎమ్ ముని శేఖర్, మరో ముగ్గురు పోలీసులు దుండగులు నక్కిన ఇంటికి(తేజ్ రామ్ అనే వ్యక్తికి చెందినది) వెళ్లినట్లు రాజస్థాన్లోని పాలి జిల్లా ఎస్పీ దీపక్ భార్గవ తెలిపారు.
పోలీసులు రాకను గుర్తించిన దుండగులు వారిపై ఎదురుదాడికి దిగినట్లు చెప్పారు. దీంతో నలుగురు పోలీసులు పక్కనే ఉన్న గోడను దూకి తప్పించుకోవాల్సిన పరిస్థితి తలెత్తినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఎస్సై పెరియార్ పాండియన్ లోపలే ఉండిపోయారని తెలిపారు. దుండగుల నుంచి పెరియార్ను కాపాడేందుకు ముని శేఖర్ రివాల్వర్ను ఉపయోగించారని చెప్పారు. తుపాకీ గుండు పెరియార్ను తాకడంతో ఆయన మృతి చెందారని తెలిపారు.
అయితే, ముని శేఖర్ కావాలనే పెరియార్ను కాల్చారా? లేక యాక్సిడెంటల్గా తుపాకీ ఫైర్ అయిందా? అనే విషయంపై స్పష్టత లేదని చెప్పారు. తేజ్ రామ్ భార్య, కూతురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.