శ్రీను హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
10 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు
సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనకాపల్లి డీఎస్పీ ప్రసాదరావు
విశాఖపట్నం ,చోడవరం: తీవ్ర సంచలనం సృష్టించిన చోడవరంలో మండే శ్రీనివాసరావు హత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. మంగళవారం రాత్రి చోడవరానికి చెందిన మండే శ్రీనివాసరావు అలియాస్ న్యూడిల్స్ శ్రీను హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్య జరిగిన ప్రదేశమైన చోడవరం శివారు ద్వారకానగర్లో అనకాపల్లి డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసు అధికారుల బృందం విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. హత్యకు గురైను శ్రీను కుటుంబ సభ్యులను, ఆయనతో సంబంధం ఉన్న వ్యక్తులను పిలిపించి మాట్లాడారు. హతుడికి సంబంధించిన రెండు ఇళ్లను పరిశీలించారు. అనుమానితులపై నిఘా పెంచడంతోపాటు పలువురిని విచారించారు. శ్రీను వ్యవహార శైలి, ఆయనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తిగత ధ్వేషంతోనే..: డీఎస్పీ ప్రసాదరావు విలేకరులతో మాట్లాడుతూ ఇది రాజకీయ హత్య కాదని, వ్యక్తిగత ధ్వేషాలతో చేసిన హత్యగా ప్రాథమిక విచారణను బట్టి భావిస్తున్నామన్నారు.
ఇద్దరు సీఐల పర్యవేక్షణలో 10 బృందాలను ఏర్పాటుచేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. జిల్లాలో వివిధ ప్రాంతాలల్లో ఈ బృందాలు ఇప్పటికే గాలింపు చర్యలు ప్రారంభించాయన్నారు. కుటుంబసభ్యుల నుంచి కూడా వివరాలు సేకరించామని తెలిపారు. ఆయనతోపాటు ఇన్చార్జి సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ లక్ష్మీనారాయణ ఉన్నారు.
సంబంధిత వార్తలు