బుల్లెట్‌ దిగితే గాని మాట వినరు!

Police Gun Fires On Rowdy Sheeters In Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు  : ఉద్యాననగరిలో పెట్రేగిపోతున్న నేరాలను అదుపు చేయడానికి పోలీసులు కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. గత ఆరునెలల్లో 20 మంది రౌడీషీటర్లకు పోలీసులు తుటా రుచి చూపించారు. 2018లో 30 మంది రౌడీషీటర్లపై పోలీసులు కాల్పులకు పాల్పడగా, గత ఆరునెలల్లో 20 మంది రౌడీషీటర్లపై కాల్పులు జరిపి పోలీసులు తమదైన శైలిలో హెచ్చరించారు. ప్రస్తుతం బెంగళూరు నగరాన్ని హడలెత్తిస్తున్న దారిదోపిడీలు, మోబైల్‌ చోరీలు, చైన్‌స్నాచింగ్‌ కేసులు హెచ్చుమీరుతున్నాయి. ఇటువంటి నేరాలు అరికట్టడానికి పోలీసులు పరేడ్‌ నిర్వహించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే కూడా వారిలో మార్పు కనిపించలేదు. గంజాయి మత్తులో దాడులకు దిగుతున్నారు. ఇటీవల నగర పోలీస్‌ కమిషనర్‌గా అలోక్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న రౌడీషీటర్లను ఆయ విభాగాల్లోకి పిలిపించి తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.  

బెంగళూరు నగరాన్ని హడలెత్తిస్తున్న రౌడీషీటర్‌ లక్ష్మణను పట్టపగలే ప్రత్యర్థులు హత్యకు పాల్పడ్డారు. మూడు సుపారీగ్యాంగ్స్‌ ఏకమై పక్కాపథకంతో రౌడీషీటర్‌ లక్ష్మణను అంతమొందించారు. ఈ కేసుకు సంబంధించి మార్చిలో ఆకాష్‌ అలియాస్‌ మలేరియా, క్యాట్‌రాజా, హేమంత్‌కుమార్‌పై పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్‌ చేశారు. ఒకే కేసులో ముగ్గురు నేరగాళ్లపై కాల్పులకు దిగడం గత పదేళ్లులో ఇదే మొదటిసారి. అనంతరం సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఈ కేసులో నిందితులపై కోకాయాక్టు అమలు చేశారు. ఇటీవల వయ్యాలికావెల్‌లో అమాయకుడైన ఎలక్ట్రీషియన్‌ గణేశ్‌ను 2019 జూన్‌ 17న హత్యకు పాల్పడిన శ్రీనివాస్‌పై పోలీసులు కాల్పులకు పాల్పడి అరెస్ట్‌ చేశారు. జూన్‌ 20న  సీసీబీ పోలీసులు శివాజీనగర రౌడీషీటర్‌ పప్పు కాల్పులు జరిపి అరెస్ట్‌ చేశారు. 1980లో బెంగళూరులో ఘరానా నేరగాడిగా ఉన్న కోళిఫయాజ్‌ కుమారుడే పప్పు. ఇతను దోపీడీలు, దొంగతనాలు, చోరీలతో బెంగళూరు నగర పోలీసులకు పెద్ద సవాల్‌గా మారాడు.  

  •  జనవరి 7న  కేజీ.హళ్లి పోలీసులు తబ్రేజ్‌ఖాన్‌పై కాల్పులు జరిపి అరెస్ట్‌ చేశారు. ఇతని 12 కేసులు నమోదయ్యాయి.   
  •  ఫిబ్రవరి 5 న సీసీబీ పోలీసులు రౌడీషీటర్‌ స్లంభరత్‌పై కాల్పులు జరిపి అరెస్ట్‌ చేశారు.   
  • మార్చి 26న సూలదేవనహళ్లి పోలీసులు దోపిడీలకు పాల్పడుతున్న దేవరాజు, చం ద్రశేఖర్‌లపై కాల్పులుజరిపి అరెస్ట్‌ చేశారు.  
  •  మార్చి 28 నందినీ లేఔట్‌ పోలీసులు రౌడీషీటర్‌ లగ్గెరె మునిరాజు కాల్పులు జరిపారు.  
  •  మార్చి 30న కుమారస్వామి లేఔట్‌ పోలీసులు దుండగుడు రాజేంద్ర కాల్పులు, ఇతను ఏటీఎం సెక్యూరిటీ గార్డును హత్య కేసులో నిందితుడు.  
  • ఏప్రిల్‌ 28న కాటన్‌పేటే పోలీసులు దోపిడీదొంగ బడిస్సాకు చెందిన మన్సూర్‌ఖాన్‌పై కాల్పులు జరిపి అరెస్ట్‌ చేశారు.
  • జూన్‌ 15 తూర్పు విభాగం పోలీసులు పలు దోపిడీ కేసుల్లో నిందితుడు నమ్‌రాజ్‌బసాకత్‌పై కాల్పులు జరిపి అరెస్ట్‌ చేశారు.  
  • జూన్‌ 23న బ్యాటరాయనపుర పోలీసులు దోపిడీదారుడు గోవింద్‌ అలియాస్‌ రాహుల్‌పై కాల్పులు జరిపి అరెస్ట్‌ చేశారు.  
  • జూన్‌ 24 బాణసవాడి పోలీసులు రౌడీ అశోక్‌పై కాల్పులు జరిపి అరెస్ట్‌ చేశారు. ఇతను నగరంలో పలు ప్రాంతాల్లో దోపిడీలు చేశాడు. 
Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top