హత్య చేసిన 25 ఏళ్లకు.. సినిమాను తలపించేలా..
చెన్నై: బాషా సినిమాలో కథానాయకుడు రజనీకాంత్ ముంబైలో దాదాగా ఉండి.. అనంతరం ఆటో డ్రైవర్గా తలదాచుకుంటాడు. ఇదే తరహాలోనే అజ్ఞాతంలో ఉన్న ఓ ఖైదీని 25 ఏళ్ల తరువాత గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా ఆరూరు సంభవనల్లూరుకు చెందిన రవిచంద్రన్ 1984లో ఓ కాంట్రాక్టర్ను హత్య చేశాడు. ఈ కేసులో ఇతనికి కృష్ణగిరి కోర్టు జీవిత శిక్ష విధించింది. దీంతో రవిచంద్రన్ను వేలూరు సెంట్రల్ జైలులో ఉంచారు. 1994లో పెరోల్పై బయటకు వచ్చిన రవిచంద్రన్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. పోలీసులు పలు చోట్ల గాలించినప్పటికి ఆచూకీ తెలియరాలేదు.
25 ఏళ్ల అనంతరం రవిచంద్రన్ తిరుప్పూరులో ఆటో నడుపుతున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. పోలీసులు బుధవారం రాత్రి తిరుప్పూరుకు చేరుకుని ఉదయం ఆటో స్టాండ్ వద్ద ఉన్న రవిచంద్రన్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను ఆటో నడుపుతూ పేరును మురుగన్గా మార్చుకుని ఒక మహిళను వివాహం చేసుకుని జీవిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు రవిచంద్రన్ను అరెస్ట్ చేసి వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.