జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చి మరోసారి..
ముంబై : మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్టైన వ్యక్తి బెయిల్పై విడుదలై మరోసారి బాధితురాలిపై అదే నేరానికి పాల్పడిన ఘటన ముంబైలో వెలుగుచూసింది. 2013లో నిందితుడు మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆ నేరంపై శిక్ష అనుభవిస్తూ బెయిల్పై జైలు నుంచి విడుదలైన కొద్దిరోజుల కిందట తిరిగి బాధితురాలిని లైంగికంగా వేధించాడని పోలీసులు తెలిపారు. నిందితుడు, బాధిత మహిళ ఇరుగు పొరుగు వారని 2012 నుంచి ఒకరికి ఒకరు పరిచయం ఉందని చెప్పారు. 2013లో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తనపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహం చేసుకునేందుకు నిరాకరించడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో నిందితుడిని అరెస్ట్ చేశారు.
కొద్దినెలల తర్వాత నిందితుడు బెయిల్ పొందాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మహిళను కలిసేందుకు నిందితుడు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆమె నిరాకరించింది. ఈనెల 25న మరోసారి మహిళ ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. మహిళ తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను కత్తితో బెదిరించిన నిందితుడు బలవంతంగా బాధితురాలిని తన బైక్పై ఎక్కించుకుని తన ఇంటికి తీసుకువచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని చెంబూర్ పీసీకి చెందిన సీనియర్ పోలీస్ అధికారి జయప్రకాష్ భోసలే తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించామని ఆయన చెప్పారు.