మానవత్వం మంటకలిసింది..
మోటారు సైకిల్ ఢీకొని వ్యక్తి మృతి
ప్రమాద స్థలంలోనే క్షతగాత్రుడిని వదిలిన వైనం
అల్లవరం(అమలాపురం): రోడ్డుపై నడిచి వెళ్తుతున్న వ్యక్తిని ఢీకొట్టడమే కాకుండా చావు బతుకుల్లో ఉన్న వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్లిపోయాడు ఓ ప్రబుద్ధుడు. పోలీసుల కథనం ప్రకారం.. మొగళ్లమూరు శిరగట్లపల్లి గ్రామానికి చెందిన రొక్కాల రవి(24) సోమవారం రాత్రి 11 గంటల సమయంలో తుమ్మలపల్లి శాంతి కాన్వెంట్ సమీపానికి రోడ్డుపై నడుస్తుండగా ఓడలరేవు నుంచి అమలాపురం వైపు మోటారుసైకిల్పై వెళుతున్న కామాడి శివ మోటారుసైకిల్తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రవి మృతి చెంది పక్కనే తుప్పల్లో పడిపోయాడు. రవికి ఎడమ కాలు విరిగి, చెవులు, ముక్కు నుంచి రక్తం కారుతోంది.
ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం చేసిన శివ తన బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వారు వచ్చి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రవిని పట్టించుకోకుండా శివని ఆస్పత్రికి తరలించారు. శివతో పాటు రవిని ఆస్పత్రికి తీసుకు వెళ్లి ఉంటే బతికేవాడని పలువురు తెలిపారు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు మోటారు సైకిల్ను ఓ ఇంటి ఆవరణలో దాచి పెట్టి చేతులుదులుపుకొన్నారు. రోడ్డు పక్కనే ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు అల్లవరం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై డి.ప్రశాంత్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో చుట్టుపక్కల గాలించగా.. దాచి పెట్టిన మోటారుసైకిల్ని గుర్తించారు. మోటారుసైకిల్ ఆధారంగా ఓడలరేవు గ్రామానికి చెందిన కామాడి శివగా గుర్తించారు. ప్రస్తుతం ప్రమాదం చేసిన శివ అమలాపురం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.