మత్తుమందు ఇచ్చి బాలికపై లైంగిక దాడి

Nolestation on Girl Child in Tamil Nadu - Sakshi

ఇద్దరి అరెస్టు మరొకరి కోసం గాలింపు

తమిళనాడు, తిరువళ్లూరు: మత్తు మందు ఇచ్చి బాలిక(17)పై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన తిరువళ్లూరు జిల్లా అధిగత్తూరులో కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా పట్టరై ప్రాంతంలో కృష్ణగిరి జిల్లాకు చెందిన కుటుంబం నివాసముంటోంది. ప్లాస్టిక్‌ పేపర్‌లను సేకరించి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు షాపుకు వెళ్లిన 17 ఏళ్ల బాలికతో ఆటో డ్రైవర్‌ మాటలు కలిపాడు. తాను పట్టరై వైపు వెళుతున్నానని, ఆటోలో వస్తే ఇంటి వద్ద వదిలిపెడతానని నమ్మించాడు. అనంతరం పక్కనే ఉన్న మెడికల్‌ షాపునకు వెళ్లి మత్తుమందు తీసుకుని కూల్‌డ్రింక్‌లో కలిపి యువతికి ఇచ్చాడు. ఈ డ్రింక్‌ తాగిన యువతి మత్తులోకి వెళ్లింది.

బాలికను అధిగత్తూరు చెరువు వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. మరో ఇద్దరిని పిలిపించడంతో వారు కూడా యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ సమయంలో అటు వైపు వస్తున్న ఉపాధి హమీ కూలీలను చూసిన ముగ్గురు యువకులు పరుగులు పెట్టారు. వారిని వెంబడించి ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ముళ్ల పొదల మధ్య మత్తులో పడి ఉన్న యువతిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో యువకులు «అధిగత్తూరుకు చెందిన మునస్వామి, ఏకాటూరుకు చెందిన భూపాలన్‌గా గుర్తించారు. వీరిని రిమాండ్‌కు తరలించారు. మత్తులో ఉన్న యువతిని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top