బెంగాల్‌లో నిర్భయ తరహా ఘటన

Nirbhaya Case In West Bengals Jalpaiguri - Sakshi

‍కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. జల్పాయిగురి జిల్లాలో భూవివాదం నేపథ్యంలో ఓ మహిళపై తన బంధువు లైంగిక దాడికి పాల్పడి, ఆమె జననాంగంలో ఐరన్‌ రాడ్‌ను చొప్పించిన దారుణం వెలుగుచూసింది.  జల్పాయిగురి సదర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన 2012లో దేశరాజధానిలో కదులుతున్న బస్సులో మహిళపై జరిగిన సామూహిక లైంగిక దాడి కేసును తలపిస్తోంది.

దూప్‌గురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నిరంజన్‌ పట్‌ ప్రాంతంలో బాధితురాలి ఇంటి సమీపంలోని చెరువు వద్ద శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. భూ వివాదం పరిష్కరించుకునేందుకు మాట్లాడదామనే సాకుతో మహిళను నిందితుడు ఇంటి నుంచి పిలిచి లైంగిక దాడికి పాల్పడి తీవ్ర వేధింపులకు గురిచేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడి వెంట మరో వ్యక్తి కూడా ఉన్నాడని, అయితే అతడు లైంగిక దాడిలో పాల్గొనలేదన్నారు. ఘటనా స్ధలంలో బాధితురాలిని చూసిన రిక్షా నడిపే వ్యక్తి ఆమెను ఇంటికి చేర్చగా ఆదివారం ఉదయం జల్పాయిగురి సదర్‌ ఆస్పత్రికి తరలించారని చెప్పారు. బాధితురాలిపై దాడి జరిగిన సమయంలో భర్త ఇంట్లో లేకపోవడం గమనార్హం. నిందితుడి బంధువు, అతడి వెంట ఉన్న వ్యక్తిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top