ఇంకా మిస్టరీగా సాయి చైతన్య అదృశ్యం
ప్రేమలో మోసపోయా
ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్పీ వీడియో
సూసైడ్ లేఖతో తల్లిదండ్రుల ఫిర్యాదు
ప్రియురాలి తల్లిదండ్రులపై ఆరోపణ
సాయి చైతన్యపై సీసీఎస్లో సంధ్య ఫిర్యాదు
మల్కాజిగిరి: మల్కాజిగిరికి చెందిన సాయి చైతన్య అనే యువకుడి అదృశ్యం మిస్టరీగా మారింది. దాదాపు 15 రోజుల తర్వాత అతని సెల్పీ వీడియో కలకలం రేపుతోంది. తల్లితండ్రుల కథనం ప్రకారం...మల్కాజిగిరి భవానీనగర్లో ఉంటున్న పాండురంగం కుమారుడు సాయి చైతన్య (26) గతంలో ప్రైవేట్ ఉద్యోగిగా పని చేసేవాడు. మణికొండకు చెందిన బంధువు సత్యనారాయణ కుమార్తె సంధ్య ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలియడంతో సంధ్య కుటుంబసభ్యులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.
గత ఆగస్టులో సంధ్య ఇంటికి వెళ్లిన సాయి చైతన్య పెళ్లి ప్రస్తావన తేగా ఆమె నిరాకరించింది. దీంతో అతను ఆమె ఇంటి వద్దే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాయదుర్గం పోలీసులు అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రేమించిన సంధ్య మోసం చేసినందునే తన కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, ఆమెపై చర్యలు తీసుకోవాలని పాంగురంగం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తనకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ మానవ హక్కుల సంఘానికి పిర్యాదు చేశాడు. పిటిషన్ పై తగిన విచారణ జరిపించి అక్టోబర్ 23లోగా నివేదిక అందజేయాలని మాదాపూర్ ఏసీపీకి నోటీసులు జారీ చేసింది.
20న నివేదిక, 21 న అదృశ్యం
అక్టోబర్ 20న మాదాపూర్ డివిజన్ ఏసీపీ సాయిచైతన్య ఘటనపై రాయదుర్గం పోలీసులు జీడీ ఎంటర్ చేశారని ఆ అమ్మాయిని సాయిచైతన్యను వివాహం చేసుకోమని చెప్పే అధికారం లేదని రాయదుర్గం ఇన్స్పెక్టర్ తెలియజేశారని ఏసీపీ రమణకుమార్ నివేదిక ఇచ్చారు. అదే రోజు సాయి చైతన్య ఇంటి నుంచి వెళ్లి పోవడంతో అతని తల్లి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు సమయంలో సాయి చైతన్య రాసిన సూసైడ్ నోట్, తన సెల్పీ వీడియో క్లిపింగ్లను జత చేసింది.
దర్యాప్తు చేస్తున్నాం
సాయి చైతన్య అదృశ్యం పై అతని తల్లి ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. దర్యాప్తులో భాగంగా అక్టోబర్ 6న సీసీఎస్ సైబరాబాద్లో సంధ్య అనే యువతి సాయిచైతన్య తనను తన కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని తనకు సంబందించిన వ్యక్తిగత ఫోటోలు సోషల్మీడియాలో ఉంచాడని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైనట్లు తెలిపారు.
– ఇన్స్పెక్టర్ జానకిరెడ్డి