పక్కా ప్లాన్ ప్రకారం; శర్మగా నమ్మించి..
జైపూర్ : తాను బ్రాహ్మణుడినని నమ్మించి హిందూ యువతిని పెళ్లి చేసుకున్నాడో ఓ ముస్లిం వ్యక్తి. తన మోసం బయటపడటంతో భార్య, కుటుంబంతో సహా మాయమయ్యాడు. పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటుందన్న ఒక్కగానొక్క కూతురు కనిపించకుండా పోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన రాజస్తాన్లోని సిఖార్లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇమ్రాన్ భాటి అనే వ్యక్తికి పెళ్లై, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన పేరు కబీర్ శర్మ అని బాధిత కుటుంబంతో పరిచయం పెంచుకున్న ఇమ్రాన్.. తమది సంప్రదాయ కుటుంబమని వధువు కోసం వెదుకుతున్నామని చెప్పేవాడు. ఈ క్రమంలో అతడిని గుడ్డిగా నమ్మిన బాధిత కుటుంబం తమ కూతురినిచ్చి వివాహం జరిపించేందుకు అంగీకరించారు. మే 13న జైపూర్లో ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్నంగా 11 లక్షల రూపాయలు, రూ. 5 లక్షల విలువైన నగలు, ఖరీదైన దుస్తులు కానుకలుగా ఇచ్చారు. అయితే పెళ్లైన రెండోరోజే అదనపు కట్నం తేవాలంటూ నవ వధువును వేధించసాగారు. ఈ విషయం ఆమె తల్లిదండ్రుల దృష్టికి రావడంతో ఇమ్రాన్ ఇంటికి వెళ్లి చూడగా.. అతడికి ఇది వరకే పెళ్లైందని, తనొక ముస్లిం అని తెలిసింది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత రోజు నుంచి ఇమ్రాన్తో సహా తమ కూతురు కనిపించకుండా పోయిందని మరోసారి పోలీసులను ఆశ్రయించారు.
ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘ పక్కా ప్లాన్ ప్రకారమే ఇమ్రాన్ బాధిత కుటుంబాన్ని మోసం చేశాడని విచారణలో తేలింది. అతడే కాదు..పెళ్లి సమయంలో అతడి తరఫున వచ్చిన బంధువులు, పనివాళ్లు.. ఆఖరికి ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఇలా ఎవరితోనూ అతడికి సంబంధం లేదు. వారికి కొంతమొత్తం చెల్లించి నాటకం ఆడించాడు. ప్రస్తుతం ఈ పెళ్లి జరిగిందనడానికి బాధిత కుటుంబం సెల్ఫోన్లలో తీసిన ఫొటోలు మాత్రమే సాక్ష్యాలు. త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తాం’ అని పేర్కొన్నారు.