అనుమానంతోనే హత్య
రేపోణి హత్య కేసులో మృతురాలి భర్త అజిత్ అరెస్ట్
వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజారత్నం
దంతాలపల్లి (వరంగల్): గత నెల 29న మండలంలోని రేపోణి గ్రామంలో వివాహిత రజితను హత్యచేసిన పరారైన భర్త అజిత్ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాజారత్నం తెలిపారు. మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. రేపోణి గ్రామానికి చెందిన మిడతపల్లి ఉప్పలయ్య, మంగమ్మ దంపతుల రెండో కూతురు రజితకు వీరారంనకు చెందిన అజిత్తో 2009లో వివాహం జరిపించారు.
నాలుగు సంవత్సరాలుగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. గ్రామ పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించినప్పటికీ అజిత్లో ఏమాత్రం మార్పురాకపోగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో మే 29వ తేదీన హైదరాబాద్ నుంచిపదునైన కత్తిని వెంట తెచ్చుకుని, రేపోణి గ్రామంలోని భార్య ఇంటికి చేరుకున్నాడన్నారు. ఇంటిలోపల నిద్రిస్తున్న రజితను కత్తితో ఛాతిలో పొడిచి పారిపోయాడు.
రక్తపు మడుగులో రజిత కొట్టుమిట్టాడుతూ చనిపోయిందని డీఎస్పీ తెలిపారు. అనంతరం కత్తి, రక్తపు మరకలు ఉన్న తన చొక్కాను కుమ్మరికుంట్ల శివారులో వదిలి, తన వెంట తెచ్చుకున్న వేరే దుస్తులు వేసుకుని వెళ్లాడు.
కేసును నమోదు చేసుకుని సీఐ చేరాలు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మండలంలోని బీరిశెట్టిగూడెం గ్రామ సమీపంలో నిందితుడు ఉన్నాడనే సమాచారం మేరకు సీఐ, ఎస్సై నందీప్తో కలిసి వెళ్లి అరెస్ట్ చేసి కత్తి, రక్తపు చొక్కాను స్వాధీనం చేసుకున్నారన్నారు. నిందితుడిపై హత్యకేసు నమోదు చేసి కోర్టులో హజరుపరుచనున్నట్లు డీఎస్పీ రాజారత్నం పేర్కొన్నారు. సమావేశంలో ఏఎస్సై విజయరాజు, సిబ్బంది పాల్గొన్నారు.