భుజం తాకిందనే..
వ్యక్తి హత్య కేసులో వీడిన మిస్టరీ
నిందితుడి అరెస్ట్
చిన్న గొడవ కారణంగానే హత్య
ఖైరతాబాద్: చిన్న పాటి వివాదానికి ఓ వ్యక్తిని బండరాయితో మోది, కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సైఫాబాద్ పోలీస్స్టేషన్లో ఏసీపీ వేణుగోపాల్రెడ్డి వివరాలు వెల్లడించారు. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన బంగారి(56), భార్య చాందితో కలిసి అడ్డా కూలీలుగా పనిచేసేవాడు. ఈ నెల 18న అతను ఖైరతాబాద్లోని మెట్రో ప్లై ఓవర్ కింద దారుణ హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం రాత్రి భార్యతో గొడవపడి బంగారి ఇంట్లో నుంచి బయటికి వచ్చి మెట్రో ప్లై ఓవర్ కింద డివైడర్పై నిద్రకు ఉపక్రమించాడని, ఆ సమయంలోనే హత్యకు గురైనట్లు గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులపై అనుమానంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి అర్థరాత్రి రాయితో ఆ ప్రాంతంలో తిరగాడినట్లు గుర్తించారు. దీంతో సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించి కీలక ఆధారాలను సేకరించారు. అతడి ఫొటోను పరిసర ప్రాంతాల్లోని యువకులకు చూపించగా, అతను ప్రకాశ్రాజ్, అలియాస్ డాలర్ పింటుగా తెలిపారు. దీంతో సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ గంగారెడ్డి ఆధ్వర్యంలో 6 బృందాలుగా ఏర్పడి 48 గంటల్లో కేసును చేదించారు.
గొడవ కారణంగానే..
హత్యకు గురైన బంగారి ఈ నెల 17న సాయంత్రం ఖైరతాబాద్లోని పటేల్ బంగ్లా సమీపంలో రోడ్డుపై నిలబడి ఉన్న డాలర్ పింటుకు భుజం తాకించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అదే రోజు రాత్రి బంగారి భార్యతో గొడవపడి రైల్వే గేటు దాటి వస్తుండగా అక్కడే పాన్షాప్ వద్ద ఉన్న డాలర్ పింటు అతడిని వెంబడించాడు. బంగారి మెట్రో ప్లై ఓవర్ కింద నిద్రకు ఉపక్రమించడాన్ని గమనించి తిరిగి ఇంటికి వచ్చాడు. అనంతరం మద్యం తాగి కూరగాయలు తరిగే కత్తితో బయటికి వచ్చిన అతను ఓ ఇటుక దిమ్మెను తీసుకొని డివైడర్ పైకి ఎక్కి బంగారి తలపై మోదాడు. అనంతరం కత్తితో గుండెల్లో పొడిచి హత్య చేశాడు. అక్కడి నుంచి రేరుగా బోరబండలో ఉంటున్న తన బంధువుల ఇంటికి వెళ్లాడు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా అక్కడికి చేరుకున్న పోలీసులు సోమవారం తెల్లవారు జామున నిందితుడని అదుపులోకి తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి జులాయిగా తిరిగే అతడిని తల్లి వెనకేసుకువచ్చేదని, ప్రతి నేరాన్ని తల్లికి చెప్పే వాడని పోలీసులు తెలిపారు. 2017–19 ప్రాంతంలో అతడిపై కేసులు నమోదైనట్లు తెలిపారు. మంగళవారం నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును చాలెంజింగ్గా తీసుకుని దర్యాప్తు చేపట్టిన ఎస్ఐ రాజారెడ్డి, సైదిరెడ్డి, ప్రసాద్, రవి, సైదా, బాల్రాజ్లతో పాటు కానిస్టేబుళ్లు పవన్కుమార్, తుల్జా, మహేందర్, హోంగార్డు జానీ బాషా, కిషోర్లను ఏసీపీ అభినందించారు.