ఎవరిని చంపటానికి కత్తితో వచ్చావ్?
కేకే.నగర్(చెన్నై): ఆపదను కొని తెచ్చుకోవటం అంటే ఇదేనేమో.. కత్తి పట్టుకుని ఉన్న ఓ వ్యక్తి వద్దకు వెళ్లి... ఎవరిని చంపాలని ఇక్కడ నిలబడ్డావ్? అని అడిగాడు ఓ దారినపోయే దానయ్య. అందుకు అవతలి వ్యక్తికి పట్టరాని కోపం వచ్చి.. వెంటాడి మరీ దానయ్యను కత్తితో నరికాడు. తమిళనాడులోని దిండుక్కల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..దిండుక్కల్ జిల్లా వేడచందూర్ సమీపంలోని పల్లపట్టికి చెందిన మురుగేశన్ (46) వంట పని కార్మికుడు. గురువారం సాయంత్రం అతడు అళగాపురిలో గల ఓ దుకాణం వద్ద వేటకత్తి పట్టుకుని ఓ అపరిచితుడు కనిపించాడు. దీంతో మురుగేశన్ అతడి వద్దకు వెళ్లి.. ఎవరిని హత్య చేయాలని ఇక్కడ నిలబడి ఉన్నావని నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన అతడు మురుగేశన్ తలపై కత్తితో గాయపరిచాడు. దీంతో భయంతో మురుగేశన్ అక్కడి నుంచి పరుగులు తీశాడు. అయితే ఆ వ్యక్తి మురుగేశన్ను వెంబడించి తరుముకుంటూ కత్తితో గాయపరిచాడు. తీవ్ర గాయాల పాలైన మురుగేశన్ను స్థానికులు వేడచందూర్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. దీనిపై కూంబూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మురుగేశన్పై కత్తితో దాడి జరిపి ఉన్న వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.
సంబంధిత వార్తలు