అమానుషం; ఇద్దరు పిల్లలను బంధించి..
భోపాల్ : అబద్ధపు సాక్ష్యం చెప్పాలంటూ ఓ వ్యక్తి ఇద్దరు పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. తనకు అనుకూలంగా పోలీసులకు వాంగ్మూలం ఇవ్వాలంటూ దారుణంగా హింసించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... ముఖ్యార్ ఖాన్(35) అనే వ్యక్తి నకిలీ పత్రాలతో భూమి కొనుగోలు చేసిన కేసులో అరెస్టు అయ్యాడు. అదే విధంగా గతంలో కూడా అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అతడు కొనుగోలు చేసిన భూమితో సంబంధం ఉన్న ఓ బడా వ్యాపారవేత్త కొడుకులను కిడ్నాప్ చేశాడు. అనంతరం వారిని దారుణంగా హింసిస్తూ ఆ తతంగాన్నంతా వీడియోలో బంధించాడు. అందులో ఓ బాలుడిని నోటితో టాయిలెట్ సీటు శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించాడు. అయితే అతడు అందుకు అంగీకరించకపోవడంతో బలవంతం చేశాడు. ఈ క్రమంలో అతడిని చితకబాదాడు.
కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో బెయిలుపై బయట ఉన్న మఖ్యార్ ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఆ ఇద్దరు బాలురు తన కొడుకును కత్తితో పొడిచి చంపేశారని, అందుకే వారిని బంధించానని అతడు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులు మఖ్యార్ కొడుకు హత్యతో సదరు బాలురకు సంబంధం లేదని తేల్చారు. భూవివాదంలో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పడం కోసమే బాలురిని కిడ్నాప్ చేశాడని వెల్లడించారు. ఈ ఘటనలో మఖ్యార్ ఖాన్, అతడికి సహకరించిన నలుగురు వ్యక్తులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.