విషం చిమ్మిన కలహాలు
ముగ్గురు పిల్లలకు గుళికలిచ్చి.. తానూ ఆత్మహత్యాయత్నం
తల్లీపిల్లల పరిస్థితి ఆందోళనకరం ∙ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఘటన
సత్తుపల్లి: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం నలుగురి పరిస్థితి ఆం దోళనకరంగా ఉంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారంలో బుధ వారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోళ్లమూడి మారేష్, జమ లమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరి కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరగాయి. దీంతో తీవ్ర కలత చెందిన జమలమ్మ ఇంట్లో ఉన్న గుళికలను కూల్ డ్రింక్లో కలిపి స్కూల్ నుంచి వచ్చిన కుమార్తెలు రేష్మ, వర్షిత, కుమారుడు భరత్లకు తాగించి.. తానూ సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గమనించిన బంధువులు వారిని సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజులు గడిస్తేగానీ వీరి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని వైద్యులు తెలిపారు. కాగా.. ఈ విషయంపై సత్తుపల్లి పోలీస్స్టేషన్లో సాయంత్రం వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.