మృతదేహంతో మూడు రోజులుగా..

Mother And Son Lived With Dead Body From Three Days In West Godavari - Sakshi

కుమార్తె మృతదేహంతో తల్లితోపాటు ఆమె సోదరుడు

ఆమె చనిపోలేదని భావిస్తూనే ఉన్న ఆ ఇద్దరూ

జంగారెడ్డిగూడెం: మృతదేహంతో ఓ ఇంట్లో తల్లి, కొడుకులు మూడు రోజులపాటు ఉన్న హృదయ విదారక సంఘటన ఇది. కుటుంబంలో ముగ్గురికీ మతిస్థిమితం లేకపోవడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మేఘనా టవర్స్‌లోని ఓ ప్లాట్‌లో మంజులాదేవి, ఆమె కుమారుడు రవిచంద్రఫణి, కుమార్తె అరుణజ్యోతి జీవిస్తున్నారు. ఈ ముగ్గురికి మతి స్థిమితం లేదని చుట్టుపక్కల వారు చెప్పారు. ఇటీవల అరుణజ్యోతి (41) అనారోగ్యానికి గురైంది. దీంతో మంచం మీదే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమె మృతిచెందింది. ఆదివారం ప్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై జీజే విష్ణువర్దన్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్లాట్‌లో తాళ్ళపూడి అరుణజ్యోతి మృతదేహం మంచంపై ఉంది. ఆమె మరణించి  సుమారు మూడు రోజులు అయి ఉంటుందని పోలీసులు తెలిపారు. అరుణజ్యోతి ఇంకా బతికే ఉందని, ఆమెను తీసుకెళ్లడానికి వీలులేదని ఆమె తల్లి మంజులాదేవి, సోదరుడు రవిచంద్రఫణి పోలీసులను అడ్డగించారు. అరుణజ్యోతి మృతదేహం నుంచి దుర్వాసన వస్తున్నా గుర్తించలేని స్థితిలో వారు ఉన్నారు. చివరకు పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. వీరు బంధువులతో విభేదించి దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వీరి మానసికస్థితి సరిగా లేదని చెబుతున్నారు. ఎస్సై విష్ణువర్దన్‌ కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top