అత్యాచార బాధితురాలికి విషం తాగించి..

Molested Victims Forced to Drink Poison While Returning from Tuition in - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. అత్యాచార బాధితురాలికి బలవంతంగా విషం తాగించి ఆమె నోరు శాశ్వతంగా మూయించడానికి యత్నించారు ఇద్దరు దుండగులు. 17 ఏళ్ల బాలిక(అత్యాచార బాధితురాలు) ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ద్వారకా జిల్లా హస్తసాల్ ప్రాంతంలో గురువారం చోటు చేసుకున్నఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్యూషన్‌కి వెళ్లి వస్తున్న బాలికను రోడ్డుపై అడ్డుకున్న దుండగులు కోర్టులో నిందితుడిపై సాక్ష్యం చెప్పొద్దంటూ బెదరించారు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెను బంధించి బలవంతంగా విషం తాగించి, అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు స్పృహకోల్పోయి కిందపడింది. గమనించిన స్థానికులు ఓ ఆటో రిక్షాలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమయానికి ఆస్పత్రికి తరలించడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. శుక్రవారంనాడు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు వ్యక్తులపై ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని తెలిపారు. 

కాగా, బాధితరాలిపై అత్యాచారం కేసులో నిందితుడు ఇటీవలే బెయిలుపై విడుదలయ్యాడు. అతనిపై గత ఏడాది అత్యాచారం కేసు నమోదైంది. తాజాగా బాధితురాలిపై విషం తాగించిన ఘటనకు సంబంధించి అతన్ని ప్రశ్నిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసలు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top