ప్రేమ, పెళ్లి పేరుతో బాలికపై అఘాయిత్యం
మోసం చేసిన యువకుడు
గర్భవతిని చేసి అబార్షన్ చేయించిన వైనం
న్యాయం కోసం పోరాడుతున్న బాధితులు
సాక్షి, గుంటూరు: ఓ బాలికను ప్రేమలోకి దించి.. గర్భవతిని చేసిన అనంతరం పెళ్లి చేసుకుని పరారయిన ఓ నయవంచకుడిపై కేసు నమోదు చేయాలని నిరసన దీక్షకు దింగిందో కుటుంబం. బాధిత బాలిక తల్లి, తమ్ముడు వారి బంధువుల కథనం మేరకు..చేబ్రోలు మండలం తోట్లపాలెం గ్రామానికి చెందిన బాలిక చేబ్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ చదువుతోంది. నాగార్జున యూనివర్సిటీలో ఎంటెక్ చదువుతున్న అమృతలూరు మండలం మూల్పూరు గ్రామానికి చెందిన మూల్పూరి గోపి ఆ బాలికకు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. చదవండి: పక్క గదిలో జంట.. కోర్కె తీర్చాలంటూ ఎస్ఐ ఒత్తిడి
వరుసకు మేనత్త కుమారుడైన గోపి తాత, బంధువులది తోట్లపాలెం గ్రామం కావడంతో తరచూ ఇక్కడే ఉండి.. బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెను గర్భవతిని చేశాడు. మార్చి నెలలో ఇంటర్ పరీక్షలు రాసే సమయంలో అనారోగ్యానికి గురవడంతో వైద్యులు పరీక్షించి బాలిక గర్భవతని తెలిపారు. గోపి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడడంతో పెళ్లికి నిరాకరించారు. దీంతో బాలిక కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించగా.. పెళ్లికి అంగీకరించాడు. మార్చి 19వ తేదీన చేబ్రోలు చీలిపాలెంలో ఇరువురు కుటుంబసభ్యులు, సంఘ పెద్దల సమక్షంలో వివాహం చేశారు. పెళ్లి అనంతరం భార్యభర్తలు మూల్పూరులోని అత్తవారింటికి వెళ్లారు.
నవ వధువుకు చిత్రహింసలు
వివాహం అనంతరం ఎన్నో ఆశలతో అత్తవారింటికి వెళ్లి నవ వధువుకు భర్త ముఖం చాటేశాడు. పథకం ప్రకారం అత్త, మామలు, చిన్న మేనత్త తదితరులు చిత్ర హింసలకు గురిచేశారు. ప్రైవేటు వైద్యుడిని పిలిపించి ఇంటిలోనే గర్భస్రావం చేయించారు. తరువాత రోజు నుంచే ఇటుకరాయి బట్టీలోకి తీసుకెళ్లి పనులు చేయించారు. కుడుపు నిండా తిండిపెట్టకుంటా, బహిర్భూమికి కూడా వెళ్లకుండా అవస్థలు పెట్టినట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు. మే 26వ తేదీన పోలీసుల సహకారంతో బాలికను ఇంటికి తీసుకొచ్చారు. పెళ్లి చేసుకుని ముఖం చాటేసిన యువకుడిని శిక్షించాలని, ప్రైవేట్ వైద్యుడితో అబార్షన్ చేయించిన అత్త మామలు, చిన్నమేనత్త తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లి, తమ్ముడు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: హార్ట్టచింగ్: నేలకు దిగిన న్యాయం!