ఘోరం: బాధితురాలి తండ్రిని కాల్చేశాడు!
లక్నో: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ అత్యాచార బాధితురాలి తండ్రిని నిందితుడు కాల్చి చంపేశాడు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించినందుకుగానూ ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు... అచ్మాన్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి గతేడాది ఆగస్టులో ఫిరోజాబాద్కు చెందిన ఓ పదిహేనేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడు పారిపోయాడు. అయితే ఇప్పటివరకూ పోలీసులు నిందితుడిని అరెస్టు చేయకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో నిందితుడు ఉపాధ్యాయ్ వారం రోజుల క్రితం బాధితురాలి ఇంటికి వెళ్లి.. కేసు వెనక్కి తీసుక్కోవాలని వేధించడం మొదలుపెట్టాడు. ఐదు రోజుల్లోగా కేసు ఉపసంహరించకోకపోతే కుటుంబ సభ్యుల్లో ఒకరిని కచ్చితంగా చంపేస్తానని బెదిరించాడు. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించి.. ఉపాధ్యాయ్ గురించి మరోసారి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారు.
ఈ క్రమంలో ఉపాధ్యాయ్ సోమవారం బాధితురాలి తండ్రిని తుపాకీతో కాల్చి పరారయ్యాడు. ఈ ఘటనలో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఘటనకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ నిరసనలు వెల్లువెత్తడంతో... ఇద్దరు స్టేషను ఇంచార్జులు సహా మరో అధికారిని సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఉత్తరప్రదేశ్లో జరిగిన ఉన్నావ్ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే.