మానవ మృగాళ్లు

Molestation on College Students in Tamil nadu - Sakshi

ప్రేమికుల ఏకాంత దృశ్యాల చిత్రీకరణ

బెదిరింపులతో యువతిపై సామూహిక లైంగికదాడి

వాటిని కూడా వీడియోలో నిక్షిప్తం

ఐదుగురు యువకుల కిరాతకం

బాధిత యువతి ఆత్మహత్యాయత్నం

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమ కోరిక తీర్చుకోవడానికి పశువుల్లా ప్రవర్తించారు. ప్రేమికుల జీవితంతో చెలగాటమాడి మృగాళ్లలా వ్యవహరించారు. ప్రేమజంట సన్నిహిత దృశ్యాలను అడ్డుగా పెట్టుకుని ఓ కాలేజీ విద్యార్థిని జీవితాన్ని బలితీసుకున్నారు. జీవితం చిధ్రం కావడాన్ని భరించలేక ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సేలం జిల్లా ఆత్తూరు సమీపం అమ్మాపాళయం గ్రామానికి చెందిన ఒక విద్యార్థిని నామక్కల్‌ జిల్లా రాశీపురంలోని ఒక ప్రయివేటు కాలేజీలో చదువుతోంది. కాలేజీ బస్సులో ఆ యువతి వెళ్లి వచ్చే సమయాల్లో ఒక యువకుడు మోటార్‌బైక్‌పై అనుసరిస్తూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. సేలం జిల్లా అమ్మపాళయానికి చెందిన ఐదు మంది యువకులు ఈ ప్రేమికుల చేష్టలను గమనిస్తూ నిఘాపెట్టారు. ఇటీవల ఒకరోజు ప్రేమికులిద్దరూ ‘ఏకాంతంగా’గడపడాన్ని రహస్యంగా తమ వీడియోలో చిత్రీకరించారు. ఆ వీడియో దృశ్యాలను ఇంట్లో చూపకుండా ఉండాలంటే తమ కోర్కె తీర్చాలని యువతిని బెదిరించారు. ఆపై ఆ యువతిని నగ్నంగా మార్చి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఐదు మందిలో ఒకడు ఈ దృశ్యాలను సైతం రహస్యంగా సెల్‌ఫోన్‌ కెమెరాతో వీడియోగా చిత్రీకరించాడు. తాము పిలిచినపుడల్లా వచ్చి కోర్కె తీర్చాలని పదేపదే వత్తిడి చేయడంతో సేలం జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధితురాలు బుధవారం ఫిర్యాదు చేసింది. నిందితులను గుర్తించి తగిన శిక్ష పడేలా చూస్తామని ఆమె తల్లిదండ్రులకు పోలీసులు హామీ ఇచ్చారు. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు ఇచ్చిన తరువాత ఇంటికి చేరుకున్న యువతి తీవ్రమానసిక కుంగుబాటుకు లోనైంది. గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉన్న ఏదో మాత్రలను పెద్దసంఖ్యలో మింగేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుర్తించిన ఆమె తల్లి ఆత్తూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చింది.

విచారణలో గగుర్పొడిచే విషయాలు
దీనిపై మీడియా ప్రతినిధులు పోలీసులను ప్రశ్నించగా, విద్యార్థినిపై ఘాతుకానికి పాల్పడిన ఐదుగురు నిందితుల్లో కాలేజీ బస్సు డ్రైవర్‌ కూడా ఉన్నట్లు విచారణలో గుర్తించామని తెలిపారు. ఈ డ్రైవర్‌ సహకారంతో 20 మందికి పైగా విద్యార్థినులను, మహిళా ఉద్యోగినులను అనేక కారణాలు చూపి లొంగదీసుకుని అత్యాచారాలకు పాల్పడ్డారు. ఆయా దారుణాలను వీడియోగా చిత్రీకరించడం, వాటిని ఎరవేసి మరిన్ని సార్లు లైంగికదాడులకు దిగడమో లేక భారీ ఎత్తున డబ్బులు గుంజడమో చేసేవారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు అందిందని తెలుసుకున్న ఐదుగురు నిందితులు పారిపోయారు. వారిలో ముగ్గురిని గుర్తించిన పోలీసులు ఆ యువకుల కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.

పొల్లాచ్చి ఘటన పునరావృతం
కాలేజీ విద్యార్థినులను బెదిరించి అత్యాచారాలకు పాల్పడడం, వాటిని వీడియోగా చిత్రీకరించిన యువకుల ముఠాను పొల్లాచ్చిపోలీసులు గతంలో అరెస్ట్‌ చేశారు. వందలాది మంది విద్యార్థినులు, గృహిణుల జీవితాలను కాలరాసిన ఈ దారుణ సంఘటన పునరావృతం కావడం ప్రజలను సైతం ఆందోళనకు గురిచేసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top