అర్థరాత్రి దోపిడీ దొంగల బీభత్సం
భయపెట్టి బంగారాన్ని దోచుకున్న దొంగలు
ఇచ్ఛాపురం రూరల్: అర్థరాత్రి ఇంట్లో చొరబడిన దొంగలు వివాహితను భయపెట్టి బంగారాన్ని దోచుకెళ్లిన ఘటనపై గురువారం ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టి.బరంపురం పంచాయతీ కొత్త శాసనాం కాలనీలో నివాసం ఉంటున్న దక్కత భాను భర్త విదేశాలకు వెళ్లిపోవడంతో తన ఏడేళ్ల కుమార్తెతో నివాసం ఉంటోంది. మంగళవారం అర్థరాత్రి రెండు గంటల సమయంలో పెరటి తలుపు గొళ్లెం పగలగొట్టుకుంటూ దొంగలు లోనికి ప్రవేశించారు.
విద్యుత్ దీపాలు ఆపివేయడంతో నిద్రలేచిన భాను అరిచేందుకు ప్రయత్నించడంతో దాడికి ప్రయత్నించారు. బంగారం ఇవ్వాలంటూ బెదిరించడంతో భాను చెవిలో ఉన్న పావు తులం బుట్టాలు, పావు తులం చిన్నపిల్లల ఉంగరాలతో పాటు మొబైల్ను దోచుకెళ్లారు. వచ్చీరానీ తెలుగులో మాట్లాడుతున్న దుండగులు ఒడిషాకు చెందిన వారుగా అనుమానం కలుగుతుందని బాధితురాలు పేర్కొన్నారు. భాను పిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ జీవన్కుమార్ తెలిపారు.