యువతి గొంతు కోసిన దుండగులు

Men Cuts Young Woman Neck In Orissa - Sakshi

మల్కన్‌గిరి : జిల్లాలోని కలిమెల సమితి మోంటు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న ఎంవీ–82 గ్రామంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు అదే గ్రామానికి చెందిన ప్రియాంక హల్‌ధర్‌(20) అనే యువతి గొంతు కోసి పరారయ్యారు. కాలకృత్యాల నిమిత్తం శుక్రవారం రాత్రి తల్లితో పాటు ప్రియాంక ఇంటి నుంచి బయటకు వచ్చింది. దీంతో ప్రియాంక తల్లికి అనుమానం రాకుండా నలుగురు దుండగులు ఆమె ముఖంపై గుడ్డ కప్పి కొంతదూరం తీసుకెళ్లారు. అక్కడ మొదట ప్రియాంక చేతికి గాయాలు చేసిన దుండగులు, అనంతరం ఆమె గొంతును కోసే ప్రయత్నం చేశారు. కాసేపటి తర్వాత తల్లి, ప్రియాంకను పిలవగా ఎంతసేపటికీ పలకకపోవడంతో, ఇంటికే వెళ్లిపోయిందనుకుని, తల్లి కూడా ఇంటికి వెళ్లిపోయింది.

అక్కడ కూడా ప్రియాంక లేకపోవడంతో భోరుమని విలపించింది. దీంతో చుట్టుపక్కల వారు గుమిగూడి, విషయం తెలుసుకుని ప్రియాంక జాడ కోసం గ్రామంలో కలియదిరిగి,  ఒక మారుమూల ప్రాంతంలో రక్తపు మడుగులో పడి ఉన్న ప్రియాంకను గుర్తించారు. తక్షణమే వైద్యసేవల కోసం ప్రియాంకను ఎంవీ–79 గ్రామంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని అక్కడి వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఐఐసీ అధికారి రఘునాథ్‌ మఝి స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి, ప్రమాద ఘటనను తెలుసుకుని, కేసు నమోదు చేశారు. నిందితులను అతి త్వరలోనే గుర్తించి, పట్టుకుంటామని స్పష్టం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top