అత్తింటి వేధింపులకు యువతి బలి

Married Women Commits Suicide in Visakhapatnam - Sakshi

కరాసాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

కేసు నమోదు చేసిన ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): అత్తింటి వేధింపులకు ఓ యువతి బలైంది. పిల్లలు పుట్ట లేదంటూ నిత్యం వేధింపులకు గురిచేయడంతో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కరాసాలో చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌ ఎస్‌ఐ నర్సింగరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింహాచలానికి చెందిన నూకరత్నం, కరాసాలో నివాసముంటున్న బొడ్డిపి గిరికి 2012 ఆగస్టు 8న వివాహమైంది. గిరి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పెళ్లయిన 6 ఏళ్ల వరకు పిల్లలు లేకపోవడంతో నిత్యం అత్తింటి వారు వేధింపులకు గురిచేస్తునే ఉన్నారు.

రెండు రోజుల క్రితం ఇంట్లో గొడవ జరిగింది. భర్త, అత్తమామలు, ఆడపడుచు వేధించారు. దీంతో భరించలేక ఇంట్లో ఉరి వేసుకుంది. గమనించిన భర్త వెంటనే కిందకి దించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నూకరత్నం(24) మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎయిర్‌పోర్టు పోలీసులు 498ఏ కేసు నమోదు చేశారు. బాధితురాలు మృతి చెందిన కారణంగా ఇపుడు 306 కూడా నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. మృతురాలి తల్లి సాడి రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త గిరి, అత్త అచ్చమ్మ, మామ మోహనరావు, ఆడపడుచు లక్ష్మిపై కేసు నమోదు చేశారు. విచారణ చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకునున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top