వివాహిత అనుమానాస్పద మృతి
రైలు పట్టాలపై మృతదేహం
కర్ణాటక, బొమ్మనహళ్లి: ప్రేమ వివాహం చేసుకున్న యువతి ఏడు నెలలకే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన బెంగళూరు నగర జిల్లా పరిదిలోని అనేకల్ తాలుకాలోని హిలలీగ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు...మృతురాలు చిత్రదుర్గకు చెందిన అరుణాక్షి(22) చదవు కోసం బెంగళూరు నగరానికి వచ్చింది.కళాశాల సమీపంలోనే నివాసం ఉంటున్న డ్రైవర్ శివకుమార్ను ప్రేమించింది. వీరి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఏడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. నెల రోజులుగా రామమానహళ్లి వద్ద అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కాంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు పొడచూపాయి. ఈక్రమంలో రోజూ ఇద్దరు గొడవపడేవారు. సోమవారం రాత్రి అరుణాక్షి భర్తకు ఫోన్ చేసింది.
సొంతూరికి వెళ్తున్నట్లు చెప్పి దుస్తులు సర్దుకొని వెళ్లిపోయింది. మంగళవారం ఉదయం హిలలీగ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై యువతి మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతురాలిని అరుణాక్షిగా గుర్తించారు. అయితే వంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా అరుణాక్షి ఆదివారం నుంచి కనిపించలేదని, చాలా చోట్ల వెతికినా ఫలితం లేకపోయిందని భర్త శివకుమార్ పేర్కొంటున్నాడు.
(గుట్టు బయటపెడుతుందని అత్త హతం)