శవమైన వివాహిత
పిల్లలతో భర్త పరారీ
కర్ణాటక, బొమ్మనహళ్లి: ప్రేమించి పెళ్ళి చేసుకున్న మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంఘటన నగరంలోని బొమ్మనహళ్ళి సమీపంలో ఉన్న బేగూరులో ఉన్న చాముండేశ్వరి నగరలో ఆదివారం సాయంత్రం వెలుగు చూసింది. మృతురాలు నందిని (28) కాగా, ఆమె భర్త మధు పరారీలో ఉన్నాడు. బేగూరుకు చెందిన నందిని 10 సంవత్సరాల క్రితం హాసన్ జిల్లాలోని బేళూరుకు చెందిన మధుతో ప్రేమలో పడి అతన్ని పెళ్ళి చేసుకుంది. బెంగళూరులో గార్మెంట్స్లో పనిచేసేవారు. వీరికి ఏడు సంవత్సరాల కుమార్తె, నాలుగు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. సెప్టెంబర్ 22వ తేదీన ఆదివారం రోజున మధు ఇంటికి తాళం వేసుకుని తన కొడుకు కూతురిని తీసుకొని ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
మూడురోజుల నుంచి ఫోన్ చేసినా
నందిని కుటుంబ సభ్యులు మూడు నాలుగు రోజుల నుంచి ఎంత ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. ఒక్కరోజంతా స్విచ్ఛాఫ్ అని వస్తోంది. దీంతో ఆదివారం సాయంత్రం అక్కడ ఉన్న మరో వ్యక్తికి ఫోన్ చేసి తమ కుమార్తె ఫోన్ పని చేయడం లేదని, కొంచెం వెళ్లి చూడమని అడగ్గా అతడు వెళ్ళి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. ఇంటిలోనుంచి దుర్వాసన రావడంతో అతడు వచ్చి బేగూరు పోలీసులకు తెలుపగా, పోలీసులు వెళ్ళి చూడగా ఇంటిలో నందిని మృత దేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నందిని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధుపైన బేగూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతని కోసం గాలిస్తున్నారు. కుటుంబ కలహాలతో భర్తే చంపి ఉంటాడని అనుమానిస్తున్నారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు