కట్నం వేధింపులకు వివాహిత బలి
కర్ణాటక, కృష్ణరాజపురం : కట్నం వేధింపుల నేపథ్యంలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం మహదేవపుర పోలీస్స్టేషన్ పరిధిలోని బి.నారాయణపురలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు కోలారు జిల్లా మైలాపుర గ్రామానికి చెందిన ప్రకాశ్కు రెండేళ్ల క్రితం చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి తాలూకా మిట్టహళ్లి గ్రామానికి చెందిన ఐశ్వర్య(20)తో వివాహమైంది.
బెంగళూరు జలమండలిలో విధులు నిర్వర్తిస్తున్న ప్రకాశ్ మహదేవపురలోని బి.నారాయణపురలో ఐశ్వర్యతో కలసి నివసిస్తున్నాడు. కొద్ది కాలంగా అదనపు కట్నం తేవాలంటూ ప్రకాశ్ భార్యను వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే విషయమై శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జగింది. మనస్థాపం చెందిన ఐశ్వర్య ఆదివారం ఇంట్లో భర్త లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రకాశ్ను అరెస్ట్ చేశారు.