వివాహిత ఆత్మహత్య
హత్య చేసి ఆత్మహత్యగా
చిత్రీకరించారంటూ బంధువుల ఆరోపణ
నరసరావుపేట టౌన్: బిడ్డకు అక్షరాభ్యాసం చేయించాలన్న కోరిక తీరక పోవడంతో మనస్తాపం చెందిన తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తమ కుమార్తెను భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నరసరావుపేటలోని ప్రకాష్నగర్ లో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంఘటనకు సంబందించి వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాష్నగర్ టౌన్ హాల్ వెనుక వీధిలో నివాసం ఉంటున్న వెలమకన్ని శ్రావణి(24) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త రమేష్ కుమార్ పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహం అయింది. వారిద్దరి సంతానం అయిన మూడేళ్ల పాపకు శుక్రవారం అక్షరాభ్యాసం చేయాల్సి ఉంది.
ఉదయం 11 గంటలకు కార్యక్రమానికి హాజరుకావాల్సిన భర్త సమయానికి ఇంటికి రాలేదు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మనస్తాపం చెందిన శ్రావణి మేడపై వున్న గదిలోకి వెళ్లి ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కిందకు దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న సీఐ శివప్రసాద్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. శ్రావణిని భర్త అతని బంధువులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.