అమ్మాయిలను ఆకర్షించేందుకు ఖరీదైన బైకుల చోరీ
ముంబై : అమ్మాయిలను ఆకర్షించేందుకు ఖరీదైన బైకుల్ని దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడో ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఉద్యోగి. ముంబైలోని ఆరే పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకు చెందిన ఆశిష్ రాజ్భర్ అనే యువకుడు ఓ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్నాడు. పరిచయం ఉన్న అమ్మాయిల్ని ఆకర్షించేందుకు అతడు ఓ ఉపాయం వేశాడు. వారికి ఏ బైకంటే ఇష్టమో తెలుసుకుని వాటిని దొంగతనం చేసేవాడు. అలా దొంగతనం చేసిన ఖరీదైన బైకులపై అమ్మాయిలను ఎక్కించుకు తిరిగేవాడు. అనంతరం ఇష్టమొచ్చిన చోట బైకులను వదిలి వెళ్లిపోయేవాడు.
కొద్దిరోజుల క్రితం ఆరే ఏరియాలో ఓ బైకును దొంగతనం చేశాడు ఆశిష్. బైక్ కొద్దిగా ట్రబుల్ ఇవ్వటంతో ఓ మెకానిక్ షాపుకు వెళ్లాడు. అక్కడ షాపు యాజమానికి ఆశిష్కు మధ్య గొడవ జరిగింది. ఈ నేషథ్యంలో షాపు యాజమాని పోలీసులకు ఫోన్ చేశాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆశిష్ను విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన వారు అతడ్ని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ తమదైన శైలిలో విచారించగా బైకులను దొంగతనం చేసిన సంగతి వెల్లడించాడు. పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద ఆశిష్పై కేసు నమోదు చేశారు.