చెప్పులు కొనటానికి భార్య డబ్బులు ఇవ్వలేదని..
తిరువళ్లూరు : చెప్పులు కొనుక్కోవడానికి వంద రూపాయలు ఇవ్వడానికి భార్య నిరాకరించడంతో మనస్తాపం చెందిన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆరణిలో విషాదం నింపింది. తిరువళ్లూరు జిల్లా ఆత్తుమేడు గ్రామానికి చెందిన ఆళప్పన్. ఇతనికి భార్య మీనాతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కాంచీపురంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు చెప్పులు కొనుక్కునేందుకు వంద రూపాయలు ఇవ్వాలని ఆళప్పన్ భార్యను కోరాడు. అయితే ఇందుకు నిరాకరించిన భార్య, కాంచీపురంలోనీ పిల్లల వద్దకు వెళుతున్నాను.
పిల్లలను ఇంటికి తీసుకొచ్చిన తరువాత వంద రూపాయలు ఇస్తానని నచ్చచెప్పింది. ఈ విషయంపై భార్యభర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కాంచీపురంలో ఉంటున్న మీనాను ఇరుగుపొరుగు వారు ఫోన్లో సంప్రదించి ఆళప్పన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్టు అతన్ని వైద్యశాలకు తీసుకెళుతున్నట్టు సమాచారం అందించారు. అయితే వైద్యశాలలో అతన్ని పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్టు నిర్ధారించారు. దీనిపై ఆరణి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.