ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు..ఏమైందో కానీ..
సాక్షి, గాలివీడు(కడప) : మండల పరిధి పందికుంట గ్రామం బోయపల్లెకు చెందిన దేరంగుల వెంకటరమణ పెద్ద కుమారుడు దేరంగుల శివకుమార్ (21) ఇంట్లో ఉరి వేసుకొని బలవర్మరణానికి పాల్పడిన సంఘటన గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా..శివకుమార్ రాయచోటికి చెందిన శైలజను ప్రేమించి ఇరువురి కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. బోయపల్లెలోనే జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో నాలుగు రోజులు నుంచి భార్యభర్తలిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పక్క గదిలో వంట చేస్తున్న శైలజ గమనించి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపులు పగలగొట్టారు. కొనఊపిరితో ఉన్న శివకుమార్ను చికిత్స నిమిత్తం నూలివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గాయత్రి తెలిపారు.