ఘాతుకం: నిద్రిస్తున్న వ్యక్తి తలపై..

Man Stoned To Death In Orissa - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌ : ప్రశాంతమైన గంట్యాడ మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురికావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మండలంలోని మధుపాడలో జరిగిన ఈ హత్యకు సంబంధించి డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ కులానికి చెందిన సున్నపు ఎర్నిబాబు(42) బుధవారం రాత్రి సాయిబాబా గుడి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇంటి పునాదులపై నిద్రించాడు. గురువారం ఉదయం చూసేసరికి రక్తపు మడుగులో విగతజీవుడై పడి ఉండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వీఆర్‌ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై బి.గణేష్, సీఐ రమేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వెంటనే పోలీస్‌ జాగిలాలు, క్లూస్‌టీమ్‌ సభ్యులను తీసుకువచ్చి విచారణను వేగవంతం చేశారు.

జాగిలాలు ఎర్నిబాబు మృతదేహంను పరిశీలించి నేరుగా అదే గ్రామంలోని యాత కులానికి చెందిన ఎల్‌.కృష్ణ ఇంటి వద్దకెళ్లాయి. దీంతో పోలీసులు కృష్ణ కోసం గాలించగా పరారీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో కృష్ణే ఈ హత్య చేశాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుడు ఒక్కడా.. ఇంకెవరి పాత్ర అయినా ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఎస్పీ బి. రాజకుమారి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. సీఐ రమేష్‌ ఆధ్వర్యంలో ఎస్సై గణేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

వివాహేతర సంబంధం వల్లే..
వివాహేతర సంబంధం వల్లే ఎర్నిబాబు హత్యకు గురయ్యాడన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో మృతుడు ఎర్నిబాబు, అనుమానితుడు కృష్ణ కలిసే పనిచేసేవారు. ఈ క్రమంలో కృష్ణ భార్యతో ఎర్నిబాబుకు వివాహేతర సంబంధం ఏర్పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హత్య జరిగి ఉండవచ్చని గ్రామస్తులు, పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య ఐదు సంవత్సరాల కిందట మృతి చెందగా.. ఉన్న ముగ్గురు పిల్లల్లో ఒకరికి వివాహం జరిగింది. మిగతావారు తాతగారి ఇంటివద్ద ఉంటున్నారన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top