క్షుద్ర పూజలు ; సొంత అత్తామామలను..
రాంచీ : క్షుద్ర పూజలు చేస్తూ తన కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారన్న కోపంతో ఓ అల్లుడు సొంత అత్తామామలను నరికి చంపాడు. ఈ సంఘటన జార్ఖండ్లోని సింగ్భూమ్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సింగ్భూమ్ జిల్లా పతండా బస్తీకి చెందిన శివ్లాల్ తుడు భార్య గత కొద్దినెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. అతని కుమారుడు కూడా రెండు సంవత్సరాల క్రితం మరణించాడు. అయితే తన కుటుంబం ఇలా నాశనం కావటానికి కారణం సొంత అత్తామామలేనని శివ్లాల్ భావించాడు. వారు క్షుద్రపూజలు చేస్తూ తన కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారని అనుమానించాడు. ఈ నేపథ్యంలో రెండు మూడు సార్లు వారిని బెదిరించాడు.
అయినప్పటికీ శివ్లాల్ భార్య ఆరోగ్య పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో అత్తామామలు తన ఇంటిపై క్షుద్రపూజలు చేయటం మానలేదని అతడు ఆగ్రహించాడు. బుధవారం పదునైన కత్తితో వారిని విచక్షణా రహితంగా నరికి చంపాడు. మృతుల మనువడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శివ్లాల్ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అతడి వద్దనుంచి హత్య చేయటానికి వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.