కాలు తగిలిందని కడతేర్చాడు

Man Murdered Worker in Tamil Nadu - Sakshi

సేలం: కాలు తగిలిందని భవన నిర్మాణ కార్మికుడిని ఓ యువకుడు హత్య చేశాడు. ఈ ఘటన నామక్కల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. నామక్కల్‌ జిల్లా పల్లిపాళయం సమీపంలోని అగ్రహారం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు కార్తిక్‌ (30). ఇతనికి వివాహమై భార్యకు దూరంగా నివసిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇక్కడికి సమీపంలోని కోట్టైకాడులో మారి యమ్మ ఆలయ తిరునాళ్ల జరుగుతోంది. ఈ సందర్భంగా గురువారం రాత్రి అక్కడ వీధి నాటకం జరుగుతుండడంతో కార్తిక్‌ చూడడానికి వెళ్లాడు.

ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన భగత్‌ సింగ్‌ కూడా అక్కడికి వెళ్లాడు. భగత్‌ సింగ్‌ కార్తిక్‌ పక్కనే నిలబడి నాటకం చూస్తున్నాడు. కార్తిక్, భగత్‌ సింగ్‌ మద్యం తాగి ఉన్నారు. ఆ సమయంలో భగత్‌సింగ్‌ కాలు కార్తిక్‌కు తగిలింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ ఏర్పడి క్షమాపణ కోరమని కార్తిక్‌ భగత్‌సింగ్‌ను అడిగాడు. ఆగ్రహంతో భగత్‌ సింగ్‌ పక్కనే ఉన్న వ్యాపారి వద్ద కత్తి లాక్కొని కార్తిక్‌పై దాడి చేశాడు. స్థానికులు కార్తిక్‌ను చికిత్స నిమిత్తం పల్లిపాళయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కార్తిక్‌ మృతిచెందాడు. పల్లిపాళయం పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం  వేకువజామున భగత్‌ సింగ్‌ను అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top