అక్రమంగా నీళ్లు పట్టుకోవద్దన్నందుకు..
పెరంబూరు : ఓవర్ హెడ్ ట్యాంకు కొళాయి వద్ద అక్రమంగా నీళ్లు పట్టుకోవడాన్ని అడ్డుకున్న సామాజిక కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు. తంజావూరు సమీపంలోని వెస్ట్ కాలనీకి చెందిన ధర్మరాజ్ (67) కుమారుడు ఆనంద్ బాబు (33). సామాజిక కార్యకర్త అయిన ఇతను అదే ప్రాంతంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకు ఆపరేటర్గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కుమార్ (48), ఆయన కుమారులు గోకుల్ నా«థ్, శ్రీనాథ్ (16)లు ఆనంద్బాబు అనుమతి లేకుండా ఓవర్ హెడ్ ట్యాంకు దిగువ ఉన్న కొళాయిలో నీళ్లు పట్టుకున్నారు. దీన్ని గమనించి ఆనంద్బాబు అసలే నీటి సమస్య తాండవిస్తున్న స్థితిలో ఈ విధంగా అక్రమంగా నీళ్లు పట్టకోరాదని వారిని హెచ్చరించాడు.
దీంతో ఆగ్రహం చెందిన కుమార్, అతడి కుమారులు దుడ్డుకర్రలతో దాడి చేశారు. అడ్డుగా వచ్చిన ఆనంద్బాబు తండ్రి ధర్మరాజ్ను కూడా కొట్టారు. తీవ్ర ఆవేశానికి గురైన వారు కత్తితో ఆనంద్బాబును పొడిచారు. తీవ్రంగా గాయపడిన ఆనంద్ స్థలంలోనే రక్తపు మడుగులో నేలకొరిగాడు. స్థానికులు అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించక గురువారం ఉదయం చికిత్స పొందుతూ ఆనంద్బాబు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్రీనాథ్ను అరెస్టు చేశారు. ఈ గొడవలో గాయపడిన తండ్రి ధర్మరాజ్తో పాటు కుమార్, గోకుల్ నా«థ్, గోపినా«థ్లు అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.