సొంత తమ్ముడినే ట్రాక్టర్‌తో గుద్ది..

Man Murdered Her Brother In Mahabubabad - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ : తన వ్యవసాయ భూమిలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వని తమ్ముడిని.. అన్న ట్రాక్టర్‌తో గుద్ది చంపిన సంఘటన మహబూబాబాద్‌ మండలంలోని గుండాలగడ్డతండా గ్రామ పంచాయతీ పరిధిలోగల కస్నాతండాలో మంగళవారం చోటు చేసుకుంది. రూరల్‌ సీఐ జూపల్లి వెంకటరత్నం కథనం ప్రకారం.. కస్నాతండాకు చెందిన లూనావత్‌ శ్రీను(30)కు తండా శివారులో కొంత భూమి ఉండగా మరికొంత భూమిని కౌలుకు తీసుకుని వరినాటు వేశాడు. శ్రీను అన్న లూనావత్‌ రమేష్‌కు ఆ పక్కనే వ్యవసాయ భూమి ఉండగా వరినాట్లు వేసిన భూమి మీదుగా రమేష్‌ తన భూమిలోకి వెళ్లేందుకు సంఘటన స్థలానికి ట్రాక్టర్‌తో వచ్చారు.

ఆ సమయంలో శ్రీను వరినాటు మీదుగా ట్రాక్టర్‌ వెళ్తే పంటకు నష్టం జరుగుతుందని చెప్పగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆ వాహనాన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్లిపోయాడు. శ్రీను ట్రాక్టర్‌కు అడ్డుగా నిలబడ్డాడు. వెంటనే లూనావత్‌ రమేష్‌ ట్రాక్టర్‌ ఎక్కి స్టార్ట్‌ చేసి ముందుకు పోనివ్వడంతో శ్రీను పైనుంచి ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. దీంతో శ్రీనుకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య సంత్రాలి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏరియా ఆస్పత్రిలో శ్రీను మృతదేహాన్ని ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌ సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top