భార్యపై అత్యాచారానికి యత్నించిన స్నేహితున్ని..
సాక్షి, చెన్నై : ఇంట్లోకి చొరబడి స్నేహితుడి భార్యపై అత్యాచారానికి యత్నించిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుచ్చి సమీపానగల సమయపురం అన్నానగర్కు చెందిన ఆనంద్ (35), విజయ్ స్నేహితులు. ఆనంద్ తరచుగా విజయ్ ఇంటికి వెళ్లేవాడు. దీంతో విజయ్ భార్యపై ఆనంద్ మోజు పెంచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ భార్య అతనితో సరిగా మాట్లాడేది కాదు. సోమవారం సాయంత్రం విధులు ముగించుకున్న విజయ్, ఆనంద్ మద్యం సేవించారు. తర్వాత విజయ్ ఇంటికి రాకుండా బయటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న ఆనంద్ రాత్రి 11 గంటల సమయంలో విజయ్ ఇంటికి వెళ్లి అతని భార్యపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చేలోగా ఆనంద్ అక్కడి నుంచి పరుగుతీశాడు. అనంతరం రాత్రి 12 గంటల సమయంలో విజయ్ ఇంటికి రాగా భార్య జరిగిన విషయాన్ని తెలిపింది.
దీంతో అతడు ఆగ్రహంతో ఆనంద్ కోసం గాలించాడు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఆనంద్ సమయపురం నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న టాస్మాక్ దుకాణం ముందు పడుకుని ఉండగా విజయ్ అక్కడున్న బండరాయిని ఆనంద్ తలపై వేసి హత్యచేశాడు. తర్వాత అక్కడి నుంచి విజయ్ పరారయ్యాడు. దీనిపై సమాచారం అందుకున్న సమయపురం పోలీసులు ఆనంద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. పరారైన విజయ్ కోసం గాలిస్తున్నారు.