13 ఏళ్ల కూతురిపై కన్న తండ్రి అత్యాచారం
గురుగ్రామ్ : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కన్న కూతురు పట్ల కామపిశాచిలా మారాడు. తాగిన మైకంలో పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తూ.. 13 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు (39) పాల వ్యాన్ డ్రైవర్గా పని చేస్తూ భార్య, కూతురితో కలిసి గురుగ్రామ్కు సమీపంలోని పాల్వాల్లో నివాసం ఉంటున్నాడు. తాగుడుకు బాసిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు.
ఏప్రిల్ 19 రాత్రి తప్పతాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఆమెపై దాడి చేసి తల పగులగొట్టాడు. భర్త చేతుల నుంచి తప్పించుకున్న భార్య ఆ రోజు రాత్రి బయకు వెళ్లింది. అనంతరం టెర్రస్ పైకి వెళ్లిన తండ్రి.. కూతురికి అన్నం వడ్డించమని అడిగాడు. తండ్రికి భోజనం వడ్డించేందుకు కూతురు టెర్రస్పైకి వెళ్లగా.. అమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని మరుసటి రోజు కూతురు తన తల్లికి చెప్పగా..ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
‘ ఏప్రిల్ 19న బాగా తాగి వచ్చి నాపై దాడి చేశాడు. నేను తప్పించుకొని బయటకు వెళ్లాను. అదే రోజు రాత్రి నా కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరసటి రోజు ఈ విషయం నాకు చెప్పగా.. ఆయనను పట్టుకునేందుకు టెర్రస్ పైకి వెళ్లాను. కానీ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఫోన్ చేస్తే కట్ చేశాడు. అతను వస్తాడని ఆరోజంతా మా ఇంట్లోనే ఎదురు చూశా. కానీ రాలేదు. మరసటి రోజు ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. నా కూతురితో కూడా అసభ్యంగా మాట్లాడాడు. దీంతో చేసేది ఏమి లేక చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని బాధితురాలి తల్లి మీడియాకు తెలిపారు.
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. నిందితుడికోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. చికిత్స కోసం బాలికను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.