ఏ నిమిషాన మృత్యువు దరి చేరునో..!

Man Killed In Road Accident - Sakshi

ఏర్పేడు : ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు..అని ఏ సినీకవి రాసిన పాట ఆ లారీ డ్రైవర్‌ జీవితంలో నిజమైంది. టైరులో గాలి తగ్గిందేమోనని చెక్‌ చేస్తుంటే వెనుక నుంచి వచ్చిన మినీలారీ అతడి పాలిట మృత్యువై కబళించింది. బుధవారం అర్ధరాత్రి ఈ సంఘటన స్థానిక ఏఆర్సీ కల్యాణ మండపం సమీపంలో  పూతలపట్టు–నాయుడుపేట రోడ్డుపై చోటుచేసుకుంది. గురువారం  ఏర్పేడు సీఐ మురళి నాయక్‌ తెలిపిన వివరాలు..తమిళనాడులోని పొల్లాచ్చి చెందిన లారీ డ్రైవర్‌ సెల్వరాజ్‌(53) శ్రీకాళహస్తి వైపు వెళుతూ టైరులో గాలి తగ్గిందేమోనని అనుమానంతో లారీని  ఏర్పేడు ఏఆర్సీ కల్యాణ మండపం వద్ద ఆపాడు.

లారీ నుంచి దిగి కుడివైపు టైరులో గాలి చెక్‌ చేస్తుండగా వెనుక వైపు నుంచి కూరగాయల లోడుతో వచ్చిన మినీలారీ అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో సెల్వరాజ్‌ తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృత దేహానికి పంచనామా చేశారు. గురువారం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top