రెప్పపాటులో ఘోరం

Man Died In Road Accident In Srikakulam - Sakshi

టిప్పరు ఢీకొని రైతు మృతి

కొద్ది క్షణాల్లో ఇంటికి చేరుకుంటాడనగా మృత్యుఒడికి

కన్నీరుమున్నీరుగా  విలపిస్తున్న భార్య

పొలం పనులు పూర్తి చేసుకుని సాయంత్రం అవడంతో సైకిల్‌పై ఇంటికి బయలుదేరారు ఆ భార్యాభర్తలు. పొలానికి సంబంధించిన విషయాలు, ఇతర కష్టసుఖాలు మాట్లాడుకుంటూ వెళుతున్నారు. ‘మరో రెండు రోజులు గడిస్తే ఆడపడుచుకు చెందిన పొలం పనులు పూర్తవుతాయి. తర్వాత మన పొలంలో కలుపు తీసుకోవచ్చు’ అని భార్య చెబుతోంది.

ఇంతలోనే రెప్పపాటులో ఎదురుగా వచ్చిన టిప్పర్‌ను తప్పించాడు ఆ రైతు. ప్రమాదం నుంచి తప్పించుకున్నామని అనుకునే క్షణంలోనే టిప్పరు వెనక భాగం తగిలి తీవ్ర గాయాలపాలై భార్య కళ్లెదుటే ప్రాణాలు విడిచాడు. ఈ హృదయ విదారకరమైన ఘటన స్థానికులను కలిచి వేసింది.

జలుమూరు శ్రీకాకుళం : మండలంలోని అల్లాడలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో సైరిగాంనకు చెందిన పొన్నాన సింహాచలం(44) మృతిచెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నరసన్నపేట మండలం శివరాంపురం గ్రామం సమీపంలో సైరిగాం లోని పొలం నుంచి సింహాచలం, ఆయన భార్య లక్ష్మి సైకిల్‌పై మూడు రోజులుగా వెళ్లి వస్తున్నారు. సాయంత్రమవడంతో ఇంటికి బయలుదేరి అల్లాడ బస్‌స్టాప్‌ వద్ద అల్లాడపేట నుంచి వస్తున్న టిప్పరు ఢీకొట్టింది.

సైకిల్‌కు టిప్పరు బలంగా కొట్టడంతో వెనక సీటులో కూర్చొన్న సింహాచలం భార్య లక్ష్మి పక్కకు పడిపోయింది. సింహాచలానికి బలంగా గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించారు. అయితే కొద్ది క్షణాల్లోనే మరణించడంతో ఒక్కసారిగా అంతా ఘొల్లుమన్నారు. కష్టసుఖాలు, పొలం పనులు, ఇతర విషయాలు చెబుతూ ఉన్న భర్త తన కంటి ముందు దుర్మరణం చెందడంతో భార్య గుండెలవిసేలా రోదించింది.

కూలి చేసి జీవిస్తున్న తమ కుటుంబానికి ఇక దిక్కెవరని విలపిస్తోంది. మృతుడికి భార్య లక్ష్మితో పాటు పిల్లలు చిట్టిబాబు, అప్పలనాయుడు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ ఎం.గోవింద సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. బాగా మలుపు కావడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. కేసు నమోదు చేపి శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top