లారీ ఢీకొని దివ్యాంగుడు మృతి
నరసన్నపేట : మండలంలోని జమ్ము కూడలి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం గుణుపూర్ జిల్లా బుసికిడి గ్రామానికి చెందిన దివ్యాంగ యువకుడు కె.మన్మథరావు(27) మృతి చెందాడు. అంతర్రాష్ట్ర రహదారి నుంచి హైవే పైకి ద్విచక్ర వాహనంపై వస్తుండగా టెక్కలి వైపు నుంచి వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
ద్విచక్రవాహనం లారీ ముందు టైర్ల కిందభాగంలో చిక్కుకుంది. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న మన్మథరావు ఇటీవలే స్వగ్రామం వచ్చాడు. శ్రీకాకుళంలో వ్యక్తిగత పని నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కుమారుడు మృతి చెందాడన్న సమాచారం తెలియగానే తల్లిదండ్రులు సీతమ్మ, జిన్నారావులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు.
చేతికందిన కొడుకు మృత్యువాతపడటాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న నరసన్నపేట ఎస్ఐ జి.నారాయణస్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.