బంగారం విడిపించేందుకు వచ్చి అనంత లోకాలకు
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్
ఒకరి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు
కిస్మత్పూర్ గ్రామంలో ఘటన
అత్తాపూర్, రంగారెడ్డి : వేగంగా వస్తున్న టిప్పర్ ద్విచక్ర వాహనాదారుడిని ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటసుబ్బయ్య కుమారుడు వెంకటేశ్వర్లు(35) వ్యాపారి. గతంలో హైదరాబాద్లో వ్యాపారం చేసి రెండు మూడు నెలల క్రితం తిరిగి సొంత గ్రామానికి వెళ్లిపోయాడు.
కాగా హైదరాబాద్లో ఉన్నప్పుడు తన బంగారాన్ని నగరంలో కుదువపెట్టాడు. ఆ బంగారాన్ని విడిపించుకునేందుకు సోమవారం వెంకటేశ్వర్లు తన స్నేహితుడు కొండయ్యను కూడా నగరానికి తీసుకువచ్చాడు. సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై కిస్మత్పూర్ గ్రామంలోని హిమగిరికాలనీలో ఉండే మరో స్నేహితుడి వద్దకు వచ్చి రాత్రి అక్కడే ఉన్నాడు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కిస్మత్పూర్ నుంచి తన స్నేహితుడు కొండయ్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెంకటేశ్వర్లు బయలుదేరాడు.
ప్రభుత్వ పాఠశాల సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన టిప్పర్ వాహనం వెంకటేశ్వర్లు బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వెంకటేశ్వర్లుపై నుంచి టిప్పర్ వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందగా.. వెనుక కూర్చున్న కొండయ్య తలకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కొండయ్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వర్లు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఇంటి సమీపంలో జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.