దుబాయ్ తీసుకెళ్లి దగా చేశారు..
సాక్షి, హైదరాబాద్ : విదేశాల్లో ఉద్యోగావకాశాలంటూ యువతను నమ్మించి రూ.3 కోట్లు దండుకున్నారు. 30 మందిని దుబాయ్ తీసుకెళ్లి మూడు నెలలపాటు పలుచోట్ల తిప్పారు. తర్వాత వారిని అక్కడే వదిలేసి పరారయ్యారు. తప్పించుకు తిరుగుతున్న ఈ ఘరానాముఠా సూత్రధారి ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. కొత్త తరహా మోసానికి పాల్పడి 30 మంది వద్ద నుంచి రూ.3 కోట్ల వరకు ఈ గ్యాంగ్ కాజేసింది. ఈ ముఠా సూత్రధారి తిరుమలేశ్ను నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) పోలీసులు గురువారం పట్టుకున్నారు. వివరాలు... నగరానికి చెందిన భైరి తిరుమలేశ్ ఆయుర్వేదవైద్యుడు. ఇతడు భీమినేని వెంకటచౌదరి అనే వ్యక్తితో కలసి అమీర్పేట గురుద్వార సమీపంలో ఏడీఎస్ సొల్యూషన్స్ పేరుతో జాబ్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు ఫిర్యాదు రావడంతో గత ఏడాది నవంబర్లో పంజగుట్ట పోలీసులు తిరుమలేశ్ను అరెస్టు చేశారు. విడుదలై వచ్చిన తర్వాత తన కార్యాలయాన్ని పంజగుట్టకు మార్చి అసెంచుయేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొనసాగిస్తున్నాడు.
డమ్మీ ఇంటర్వ్యూలు... :దుబాయ్లోని దనత్ అల్ ఎమ్రత్ హాస్పిటల్తోపాటు అబుదాబిలోని ఎమరైట్స్ హాస్పిటల్లో మెడికల్ కోడింగ్ విభాగంలో ఉద్యోగాలు ఉన్నాయని, నెలకు లక్షల్లో జీతం ఉం టుందని ఈ ముఠా ప్రచారం చేసింది. ఆకర్షితులై వ చ్చినవారికి నిందితులు డమ్మీ ఇంటర్వ్యూలు కూడా చేశారు. కన్సల్టెన్సీ ఫీజు, వీసా ప్రాసెసింగ్ ఖర్చులు, విమానం టికెట్లు, దుబాయ్లో బస తదితర పేర్లు చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.7 లక్షల వరకు వసూలు చేశారు. ఆపై దుబాయ్లోని బ్రిడ్జ్ వెస్ట్ కన్సల్టింగ్ సర్వీసెస్ పేరుతో బోగస్ నియామకపత్రాలు అందించారు. ఉద్యోగాల్లో చేర్పిస్తానంటూ వెంకటచౌదరి 20 మందిని దుబాయ్ తీసుకెళ్లాడు. రేపుమాపు అంటూ దాదాపు 3 నెలలపాటు వారిని అక్కడ వివిధ చోట్లకు తిప్పాడు. ఇదేమిటని గట్టిగా ప్రశ్నించినవారిని తీ వ్రంగా బెదిరించేవాడు. ఓ రోజు హఠాత్తుగా వారిని అక్కడే వదిలేసి హైదరాబాద్కు తిరిగి వచ్చాడు. మోసపోయినవారిలో తమ మాజీ సహోద్యోగులు, వారి స్నేహితులు, తమ స్నేహితులే ఎక్కువ.
తప్పించుకు తిరుగుతూ...: అతికష్టమ్మీద ఇక్కడ కు చేరుకున్న బాధితులు ఎంత ప్రయత్నించినా నిందితుల ఆచూకీ చిక్కలేదు. తిరుమలేశ్ మూడు ఇళ్లు, నాలుగైదు సిమ్కార్డులు మార్చి అజ్ఞాతంలో గడుపుతున్నాడు. సిద్దిపేటలో కూడా అతడిపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అతడికి సీఆర్పీసీ 41(ఎ) కింద నోటీసులు జారీ చేసినా వాటిని తీసుకోవడానికి ఠాణాకు వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో కొంతమంది బాధితుల ఫిర్యాదుతో నగర నేర పరిశోధన విభాగంలో అతడిపై కేసు నమోదైంది. ప్రత్యేక బృందం ముమ్మరంగా గాలించి తిరుమలేశ్ ఆచూకీ కనిపెట్టి అరెస్టు చేసింది. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సిద్ది పేట పోలీసులు తిరుమలేశ్ను పీటీ వారంట్పై తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.