ఊరు విడిచి పారిపోయిన ఓ జంట
సాక్షి, చెన్నై : వివాహేతర సంబంధం ఓ జంట ప్రాణాల్ని బలితీసుకుంది. అదిరాంపట్టినం సమీపంలో గురువారం సాయంత్రం ప్రేమజంట విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తంజావూరు జిల్లా అదిరాంపట్టినం ఏరిపురకరై గ్రామానికి చెందిన జయకుమార్ రైతు. అతని భార్య కలైయరసి (31). వీరికి కుమారుడు (10), కుమార్తె (10) ఉన్నారు. కలైయరసి పాఠశాల పౌష్టికాహార కేంద్రంలో ఆర్గనైజర్గా పని చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వడివేలు (28) కూలీ. అతని భార్య సౌందర్య, ఒక కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో కలైయరసికి వడివేలు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి తెలియడంతో జయకుమార్ భార్యను మందలించాడు. అయినప్పటికీ కలైయరసి వడివేలుతో సంబంధం వదులుకోలేదు.
దీంతో విరక్తి చెందిన జయకుమార్ భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఈ క్రమంలో మూడు రోజుల కిందట ఊరు విడిచి పారిపోయిన వివాహేతర జంట గురువారం సాయంత్రం ఈస్ట్కోస్టు రోడ్డు సమీపంలో ఉన్న వ్యవసాయ పొలంలో విషం తాగి స్పృహతప్పి పడి ఉన్నారు. ఇది చూసిన ప్రజలు దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికే వడివేలు మృతి చెందాడు. కలైయరసి ప్రాణాలకు పోరాడుతోంది. ఆమెను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న అదిరాంపట్టినం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.