చావులో ఒక్కటయ్యారు..

Lovers Commits Suicide In Uravakonda - Sakshi

పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని ప్రేమ జంట ఆత్మహత్య

ప్రేమకు కులం లేదంటారు. వాళ్లిద్దరి పెళ్లికి కులమే అడ్డుగా నిలిచింది. నాలుగేళ్ల ప్రణయానికి నలుగురూ అడ్డుతగులు తారేమోనని భావించిన వారు చావులో ఒక్కటై వెళ్లిపోయారు. పసుపు బట్టలు కట్టుకోవాల్సిన వారు పాడెక్కడంతో రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం నెలకొంది.

సాక్షి, ఉరవకొండ: మండల పరిధిలోని చిన్న కౌకుంట్ల గ్రామంలో ఆదివారం ఉదయం ఓ ప్రేమ జంట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు, ఎస్‌ఐ ధరణిబాబు తెలిపిన మేరకు.. తుమ్మిగనూరుకు చెందిన రవి (22) నాలుగేళ్ల క్రితం కౌకుంట్లలోని తన అక్క రాజమ్మ ఇంటికి గొర్రెల కాపరిగా వచ్చాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సుశ్మిత(20)తో అతనికి పరిచయం కాగా...ఇద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వారం రోజుల క్రితం సుశ్మితకు పెద్దవాళ్లు వేరే పెళ్లి సంబంధం చూశారు. ఈ క్రమంలో తమ ప్రేమ విషయం పెద్దవాళ్లకు చెప్పే ధైర్యం లేక, వారిని ఎదిరించి కులాంతర వివాహం చేసుకోలేక ఆదివారం ఉదయం తమ ఇంటి పక్కన ఖాళీగా ఉన్న ఓ ఇంట్లో ఒకే తాడుతో ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ ధరణిబాబు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. (ఏపీలో నేటి నుంచి మద్యం అమ్మకాలు.. )

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top