శ్రీకాకుళం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, పొందూరు : తెలిసీ తెలియని వయసులో ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. కళాశాల నుంచి శుక్రవారం మధ్యాహ్నం వెళ్లిపోయిన ప్రేమికులు.. శనివారం మామిడితోటలోని ఓ చెట్టు కొమ్మకు శవాలై వేలాడుతూ స్థానికులకు కనిపించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కింతలి పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిమెట్టకు చెందిన అన్నెపు పవన్కల్యాణ్ (17), ఇదే మండలం మొదలవలసకు చెందిన రేణుక (17) కింతలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. వీరు ఇంటర్లో చేరినప్పటి నుంచే ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నారు. అయితే, ప్రేమికుడు పవన్కల్యాణ్కు తలలో సమస్య ఉంది. ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంటాడు. ఈ విషయాన్ని గతంలో పవన్కల్యాణ్ తల్లిదండ్రులకు చెప్పాడు.
ప్రేమికురాలు రేణుకకు కూడా తెలియజేయడంతో ఒకరినొకరు విడిచి ఉండలేని ఇరువురూ.. చనిపోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కళాశాల నుంచి బయటకు వచ్చేశారు. ఇళ్లకు చేరకపోవడంతో వారి కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. శనివారం ఉదయం కింతలి సమీపంలోని మామిడి తోటలోకి బహిర్భూమికి వెళ్లిన ఖాజీపేటకు చెందిన కొందరికి పవన్కల్యాణ్, రేణుకలు చెట్టు కొమ్మకు ఉరివేసుకొని చనిపోయి కనిపించారు. పవన్ పంచెతో, రేణుక చున్నీతో ఉరివేసుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీశారు. ప్రేమజంట రాసిన సూసైడ్నోట్, ఉత్తరాలను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అందరినీ వదిలేసి చనిపోతున్నందుకు క్షమించాలంటూ తల్లిదండ్రులు, స్నేహితులు, సివిక్స్ లెక్చరర్కు కల్యాణ్ లేఖలు రాసినట్టు పోలీసులు చెప్పారు.