హత్య కేసులో ప్రియుడిని పట్టించిన ప్రియురాలు

Lover Witness in Murder Case Boyfriend Arrested Tamil Nadu - Sakshi

చెన్నై,తిరువొత్తియూరు: కుమారపాళయం కావేరి నదిలో తోసి నేత కార్మికుడిని హత్య చేసిన వ్యవహారంలో ప్రియురాలు, తన ప్రియుడిని పోలీసులకు పట్టించింది. వివరాలు.. నామక్కల్‌ జిల్లా కుమారపాళయంకు చెందిన నేత కార్మికుడు వెంకటేశన్‌ (38). అతను గత నెల 8వ తేది నుంచి అదృశ్యమయ్యాడు. తండ్రి కుమారపాళయం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకటేశన్‌తో కాపురం చేస్తున్న సెల్వి, ఆమె ప్రియుడు పెరుమాల్‌ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో వెంకటేశన్‌ను కావేరి నదిలో తోసి హత్య చేసినట్టు, తన కుమార్తెను ప్రియుడు పెరుమాల్‌ నుంచి కాపాడుకోవడానికి ఈ నిజం బయటపెట్టినట్టు సెల్వి పోలీసులకు తెలిపింది.

సెల్వి భర్త నుంచి విడిపోయి జీవిస్తోంది. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో నేత కార్మికుడు వెంకటేశన్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ 10 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మద్యం అలవాటు ఉన్న వెంకటేశన్‌ రోజూ తాగి వచ్చి సెల్విని చిత్రహింసలు పెట్టేవాడని తెలిసింది. దీంతో విరక్తి చెందిన సెల్వి వెంకటేశన్‌ మిత్రుడు కుమార్‌ అలియాస్‌ పెరుమాల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంగతి తెలుసుకున్న వెంకటేశన్‌ ఇద్దరిని నిలదీశాడు. దీంతో వెంకటేశన్‌ హత్యచేయడానికి సెల్వి, పెరుమాల్‌ పథకం వేశారు. ఈ క్రమంలో అతనికి మద్యం తాగించి పెరుమాల్‌ కావేరి నదిలోకి తోశాడు. మొదట అతను నీటి నుంచి ఈదుకుంటూ బయటకు వచ్చాడని.. తిరిగి అతన్ని లోతైన ప్రాంతంలో తోసి వేయడంతో వెంకటేశన్‌ మృతి చెందినట్టు తెలిసింది. దీని తరువాత పెరుమాల్‌ సెల్వి కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో సెల్వి అతన్ని పోలీసులకు పట్టించింది. దీంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి పెరుమాల్‌ కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top